South Coast Railway Zone: కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పంది. విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
తాజాగా కొత్త రైల్వే జోన్ ను అధికారికంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే చట్టం ప్రకారం ఈ జోన్ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. విశాఖలో ఈ జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.
కొత్త రైల్వే జోన్ లోకి వచ్చే డివిజన్లు
ఈ కొత్త రైల్వే జోన్ ను ఇప్పటికే ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ల నుంచి కొన్ని భాగాలను విడదీసి ఏర్పాటు చేస్తున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలోకి రానున్నాయి. అంతేకాదు, ప్రస్తుత వాల్తేర్ డివిజన్ ను కూడా విభజించి, విశాఖపట్నం డివిజన్ గా మార్చే ప్రక్రియను రైల్వేశాఖ మొదలుపెట్టింది. వాల్తేరు డివిజన్ ను రెండు భాగాలుగా విడగొట్టనున్నారు. ఒక భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో కొత్తగా రాయగడ డివిజన్ గా ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన భాగాన్ని సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలో విశాఖపట్నం డివిజన్ గా మార్చనున్నారు. ఈ కొత్త మార్పులు సైతం జూన్ 1 నుంచే అమల్లోకి వస్తాయి.
రాయగడ డిజిజన్ లోకి ముఖ్య రైల్వే మార్గాలు
అటు రాయగడ డివిజన్ పరిధిలోకి పలు కీలక రైల్వే మార్గాలను చేర్చుతున్నారు. కోరాపుట్-సింగపూర్ రోడ్, కొత్తవలస-కిరండూల్, కునేరు-థెరువలి, గుణుపూర్-పర్లకిమిడి లాంటి మార్గాలు ఇందులో భాగమవుతాయి. ఈ కొత్త డివిజన్ మొత్తం సుమారు 696 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అదనంగా పలాసా-ఇచ్ఛాపురం రైల్వే మార్గాన్ని ఖుర్దా రోడ్ డివిజన్ నుంచి విశాఖపట్నం డివిజన్ కు బదిలీ చేశారు.
ఆపరేషనల్ ఇబ్బందులు లేకుండా కీలక మార్పులు
ఇక ఆపరేషనల్ సౌలభ్యం కోసం కొన్ని కీలక మార్పులు చేశారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్ డివిజన్ల మధ్య మార్గాల పునర్విభజన చేశారు. రాయచూర్-వాడి, విష్ణుపురం-పగిడిపల్లి మార్గాలను సికింద్రాబాద్ డివిజన్ కు బదిలీ చేశారు. అలాగే కొండపల్లి-మోతుమర్రి మార్గాన్ని విజయవాడ డివిజన్ లో చేర్చారు.
తాజా మార్పులు, చేర్పులతో రైల్వే ఆపరేషన్స్ మరింత సులభతరం అవుతాయని అధికారులు వెల్లడించారు. ప్రాంతాల వారీగా పర్యవేక్షణ మెరుగుపడి, సర్వీసుల సమన్వయం బాగుంటుందన్నారు. రైల్వే మార్గాల నిర్వహణలో స్పష్టత రావడంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందే అవకాశముందన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో రైల్వే రంగానికి మరింత బూస్టింగ్ రానుంది. కొత్త జోన్ ఏర్పాటుతో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా, రాష్ట్రానికి మరిన్ని రైల్వే ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయని రైల్వే అధికారులు చెప్తున్నారు.
Read Also: అనకాపల్లి-చర్లపల్లి కొత్త ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం, ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

