తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో అలరిస్తున్న క్రేజీ కథానాయిక అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఇటీవల వార్తల్లో ఆమె పేరునే వినిపిస్తోన్న విషయం తెల్సిందే.
కొన్నాళ్ల పాటు తమిళ హీరో ధ్రువ్ విక్రమ్(Dhruv Vikram) తో ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత బ్రేకప్ అయ్యారనే వార్తలతో సోషల్ మీడియాలో నిలిచిన అనుపమ.. బ్రేకప్ తరువాత సోషల్ మీడియాలో చేసిన కొన్ని పోస్టులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగా, ప్రస్తుతం ఆమె తెలుగులో క్రేజీ కళ్యాణం (Crazy Kalyanam) అనే సినిమాలో నటించింది. తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు భద్రప్ప గాజుల దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
తాజాగా జరిగిన క్రేజీ కళ్యాణం టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న అనుపమా పరమేశ్వరన్, విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఘాటుగా స్పందించింది. ఈ మధ్య మీ జీవితంలో జరిగిన విషయాల గురించిసోషల్ మీడియాలో మీ పోస్టులు పెట్టడం అవసరమా.. ఎవరినైనా బ్లేమ్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు అనుపమ మండిపడింది. తన సోషల్ మీడియా ఖాతాలో ఏం పోస్ట్ చేయాలో నిర్ణయించుకునే పూర్తి హక్కు తనకు మాత్రమే ఉందని, సోషల్ మీడియాలో తాను ఎవరిపైనా కోపం వెళ్లగక్కడం లేదని, కేవలం ఒక మహిళగా తన జీవితంలో వచ్చిన మార్పులు, పరిణామాల గురించే పంచుకున్నానని తెలిపింది.
అంతేకాకుండా తన మనసులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని, ఇతరులను నిందించడం తన ఉద్దేశం కాదని, అసలు తన వ్యక్తిగత జీవితం గురించి, తన మనోభావాల గురించి బయటి వారికి ఏం తెలుసని ఆమె ఘాటుగా ప్రశ్నించింది. ఇన్స్టాగ్రామ్ అనేది తన వ్యక్తిగత వేదిక కాబట్టి, తనకు నచ్చిన విషయాలను పోస్ట్ చేసుకునే స్వేచ్ఛ తనకంటూ ఉందని, ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనే రీతిలో స్పందించడంతో ఈ వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి.

