మాస్ట్రో ఇళయారాజాతో ఏదీ అంత ఈజీ కాదు. ఆయన పాటలనే కాదు... ఆయనపై సెటైరిక్ గా డైలాగ్స్ వేసినా క్షమించారు. అయితే ఈసారి హర్ట్ అయ్యింది ఇళయరాజా కాదు.
ఆయన అభిమానులు. దాంతో దిగివచ్చిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ టీమ్ ఆయనకు క్షమాపణలు తెలిపింది.
ఇంతకూ విషయం ఏమిటంటే... సూర్య (Suriya) హీరోగా ఆర్జే బాలాజీ తెరకెక్కించిన 'కరుప్పు' (Karuppu) (తెలుగులో వీరభద్రుడు) సినిమా ఇటీవల విడుదలైంది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఈ మధ్యకాలంలో మొదటి వారాంతానికే దాదాపు 150 కోట్లను వరల్డ్ వైడ్ ఈ సినిమా కలెక్ట్ చేసిన సినిమాగా 'కరుప్పు' నిలిచింది. ఇదిలా ఉంటే... ఇందులో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాపై సెటైరిక్ డైలాగ్స్ కొన్నింటి పెట్టారు. ద్వితీయార్థంలో సాంగ్స్ కాపీ రైట్పై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఈ మధ్య కాలంలో తన సినిమా పాటలను ఎవరు అనుమతి లేకుండా వాడుకున్న ఇళయరాజా నిర్మొహమాటంగా వారిపై కోర్టులో కేసు వేస్తున్నారు. దాంతో ఆయనను ఉద్దేశించే మేకర్స్ ఈ డైలాగ్స్ పెట్టారని అభిమానులు బాధ పడ్డారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

దాంతో వెంటనే మేలుకొన్న మేకర్స్... ఇళయరాజా (Ilayaraja) కు బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పాటు ఆ డైలాగ్స్ ను తొలగిస్తున్నట్టు తెలిపారు. ఎవరినీ కించపరచడం తమ ఉద్దేశ్యం కాదని, సరదాగా వినోదం కోసం రాసిన సంభాషణలు తప్పితే అవి ఎవరినీ దృష్టిలో పెట్టుకుని రాయలేదని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా అంటే తమకెంతో గౌరవమని, భారతీయ సినీ సంగీతంలో ఆయన భాగస్వామ్యాన్ని తక్కువ అంచనా వేయలేమని అన్నారు. బహిరంగంగా తన క్షమాపణలను తెలియచేయడంతో ఇళయరాజా అభిమానులు కొంత శాంతించారు. మరి దీనిపై ఇళయరాజా ఏమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

