విశ్వనాయకుడు కమల్హాసన్ (Kamal Haasan) తీసుకున్న ఓ నిర్ణయంతో ఆయన ఎంత గొప్ప నటుడో, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో చెబుతూ వైజయంతీ మూవీస్ సంస్థ ఓ ట్వీట్ చేసింది.
ఇటీవల కాలంలో సినిమా షూటింగ్ బడ్జెట్ కన్నా నటీనటులకు కల్పించే సౌకర్యాలు ఖర్చే ఎక్కువ అవుతోంది. మేకర్స్ అనవసరపు ఆర్బాటాల తగ్గించుకోవాలంటూ కమల్ హాసన్ ఇటీవల ఓ ప్రకటన జారీ చేశారు. అంతేకాదు దానిని ఆచరణ రూపంలోనూ చూపించారు. ఈ నేపథ్యంలో ఆయన 'కల్కి' సీక్వెల్ షూటింగ్కు ఎకానమీ ఫ్లైట్లో హైదరాబాద్కు వచ్చారు. దీనిని ఉదహరిస్తూ వైజయంతి మూవీస్ సంస్థ ఆయనను అభినందించింది.
'ప్రస్తుతం సినిమా పరిశ్రమ నిర్మాణపరంగా ఎంతో కష్టాలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో కమల్హాసన్ ప్రైవేట్ చార్టర్ విమానాలు, విలాసవంతమైన ప్రయాణాలను పక్కనపెట్టి, ఎకానమీ ఫ్లైట్లో నేరుగా షూటింగ్ సెట్కు వస్తున్నారు. ఆ నిర్ణయం ఆయన ఎంతటి దిగ్గజమో తెలియజేస్తోంది. చిత్ర పరిశ్రమలో అద్భుతాలు జరగడానికి ఇది మొదటి అడుగు అనుకోవచ్చు' అని ట్వీట్లో వైజయంతి మూవీస్ సంస్థ పేర్కొంది.
ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి కొనసాగింపుగా కల్కి పార్ట్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇందులో కమల్ సుప్రీం యాస్కిన్గా నటిస్తున్నారు. ఈ మధ్యన కమల్, అమితాబ్పై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. తాజా షెడ్యూల్ కోసం కమల్ హైదరాబాద్ వచ్చారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను వైజయంతీ సంస్థ ట్వీట్ చేసింది.

