పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సోమవారం పంచాయితీ రాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆయన తెలియచేశారు.
ఈ అంశం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు ఆనందాన్ని కలిగించేది కాగా, ఆ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ ఫోటోలను సోషల్ మీడియాలో చూసి జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆనంద పడ్డారు. ఎందుకంటే... ఈ ఫోటోలో పవన్ కళ్యాన్ తన క్రాఫ్ను మార్చి, గెడ్డాన్ని ట్రిమ్ చేసుకుని మళ్ళీ హీరోలెక్క కనిపించారు. దాంతో ఆ ఫోటోను అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. మేం కోరుకుంటోంది ఈ లుక్కే అంటూ అభినందనలు తెలియచేస్తున్నారు.
కొంతకాలం క్రితం హఠాత్తుగా అనారోగ్యానికి గురైన పవన్ కళ్యాణ్ అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని అత్యవసర వైద్యం నిమిత్తం హైదరాబాద్ వచ్చేశారు. ఇక్కడ ఆయనకు వైద్యులు చికిత్స చేశారు. దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని గట్టిగా చెప్పారు. దాంతో పవన్ కళ్యాణ్ కొన్ని వారాలుగా ఇంటికే పరిమితం అయిపోయారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగైందని చెప్పలేం. కానీ ప్రభుత్వపరమైన కార్యకలాపాలలో జాప్యం చేయడం ఇష్టంలేని పవన్ కళ్యాణ్ గత వారం సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి తన శాఖలకు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించారు. పనిలో పనిగా జనసేన (Janasena) నాయకులు, కార్యకర్తలతోనూ సమావేశమై తన అనారోగ్యానికి కారణాలను, తీసుకున్న చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియచేశారు. ఇంతకాలం పవన్ కళ్యాణ్కు అసలు ఏమైందనే సందేహంతో ఉన్న వారికి కొంత అవగాహన ఏర్పడింది. ఆయనతో మెలిగేప్పుడు, షేక్ హాండ్ ఇచ్చేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసి వచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సైతం స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జనసేన కార్యకర్తలకు ఆనందాన్ని కలిగించింది. ఆ సమయంలోనూ పెంచిన గడ్డంతో ఉన్న పవన్ కళ్యాణ్... సోమవారం మాత్రం దానిని ట్రిమ్ చేసి, పక్క పాపిడితో కనిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వింటేజ్ పవర్ స్టార్ను చూసినట్టుందని సంబర పడుతున్నారు.


