"ఎవరికైనా గాయాలు తగిలినప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే నేను గాయపడ్డ విషయం ఎవరికీ తెలియకూడదనుకున్నా" అని నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) తెలిపారు.
ఇటీవల 'మైసా' పాట చిత్రీకరణ సమయంలో తుంటికి గాయమవడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు రష్మిక. "నేను నా శరీరాన్ని యంత్రంలా కాకుండా, మనిషి శరీరంలా చూడటం నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో వరుసగా మూడు సార్లు గాయపడ్డాను.

ఇటీవల మైసా (Mysa) సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో నా నడుముకు కుడి భాగాన ఒక టెండన్ విడిపోయిందని వైద్యులు చెప్పారు. అది అతుక్కున్న తర్వాతే కాలు కదపగలను. ఇది నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు జరిగింది. అవిశ్రాంతంగా పనిచేస్తున్నానని గమనించి, దేవుడే నాకు ఇలా విశ్రాంతి కల్పించాడేమో అనిపిస్తోంది. ఎప్పుడూ ఒక రాక్షసిలా వర్కౌట్, రన్నింగ్ చేసే నేను, ఇలా కదలకుండా కూర్చోవడం వల్ల బరువు పెరుగుతానేమోనని భయంగా ఉంది. దానికి తోడు స్వీట్లు కూడా విపరీతంగా తింటున్నాను" అని వివరించారు.

