ప్రముఖ నిర్మాత ఎ. కె. ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర, మంచు మనోజ్ హీరోగా 'వడ్డీ కాసులవాడ' అనే సినిమాను నిర్మించబోతున్నారు. తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను మనోజ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ బ్లెస్సింగ్స్ పేరుతో విడుదల చేశారు.
విశేషం ఏమంటే ఎ. కె. ఎంటర్ టైన్ మెంట్స్ తన తొలి చిత్రాన్ని మంచు మనోజ్ తోనే నిర్మించింది. వీరు పోట్ల దర్శకత్వంలో 'బిందాస్' సినిమాను అనిల్ సుంకర 2010లో నిర్మించారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ గడిచిన పదిహేనేళ్ళలో ఆయన మళ్ళీ మనోజ్తో సినిమా నిర్మించలేదు. మధ్యలో మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా 'వీడో రకం వాడో రకం' సినిమాను ప్రొడ్యూస్ చేశారు. గత కొంతకాలంగా పరాజయాలతో ప్రయాణం సాగిస్తున్న అనిల్ సుంకర ఈ యేడాది సంక్రాంతికి విడుదల చేసిన 'నారీ నారీ నడుమ మురారి' మూవీ మంచి విజయాన్ని సాధించింది. మరి ఇప్పుడు మనోజ్ తో తీయబోతున్న 'వడ్డీ కాసులవాడ' ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇదిలా ఉంటే 'వడ్డీ కాసులవాడ' మూవీ గ్లింప్స్ లో మరోసారి మనోజ్ తన తండ్రిపై సెటైర్ వేశారు. అన్ని అనుకూలిస్తే తిరుపతిలో ఓ విద్యాసంస్థను పెడతానని, అందులో కులం, మతం అనే తేడా లేకుండా ఇరవైఐదు శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని మనోజ్ తో ఓ డైలాగ్ చెప్పించారు. మంగళవారం మీడియా సమావేశంలో కూడా మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబును పరోక్షంగా విమర్శించారు. 'మీ కుటుంబ వ్యవహారం చక్కబడినట్టేనా?' అని రిపోర్టర్స్ అడగగా, 'ఆ విషయం ఎవరిని అడగాలో వారిని అడగండి. అయితే మైక్ వెంట తీసుకెళ్లొద్దు... అలానే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి' అని చెప్పారు. ఆ డైలాగ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు కూడా మోహన్ బాబు తన విద్యాసంస్థలు ఇచ్చే ఉచిత విద్య గురించి చెప్పిన డైలాగ్ నే ఈ గ్లింప్స్ లో మనోజ్ సెటైరిక్ గా చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

