తాజా వార్తలు
1లో కోహ్లీ.. 2లో రోహిత్..3లో బుమ్రా

దుబాయ్: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో వరుసగా 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు వన్డేల్లో కోహ్లీ 89, 63 చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి ఖాతాలో 870 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కొవిడ్-19 మహమ్మారి, గాయం కారణంగా రోహిత్ వన్డేలేమీ ఆడకపోయినా రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న పాక్ సారథి బాబర్ ఆజామ్ (837) కన్నా ఐదు పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ఇక న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ (818), ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ (791) వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు.
అఫ్గానిస్థాన్ సిరీసులో 285 పరుగులు చేసిన ఐర్లాండ్ ఆల్రౌండర్ పాల్ స్టిర్లింగ్ ఎనిమిది పాయింట్లు ఎగబాకి 20వ స్థానానికి చేరుకున్నాడు. అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు హష్మతుల్లా షాహిది 70 నుంచి 66, రషీద్ ఖాన్ 96 నుంచి 89, జావెద్ అహ్మది 103 నుంచి 99 ర్యాంకులకు ఎగబాకారు. బౌలర్ల జాబితాలో బుమ్రా 700 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానం దక్కించుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ (722), ముజీబుర్ రెహ్మాన్ (701) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. వెస్టిండీస్ సిరీసులో ఏడు వికెట్లు తీసిన బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ మీర్జా తొమ్మి స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ 19వ స్థానం నుంచి 8వ ర్యాంకుకు ఎగబాకాడు.
రూట్.. రైట్ రైట్! కోహ్లీ ఆపగలడా?
గంగూలీకి మరోసారి అస్వస్థత?