ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల కోసం ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఉన్నతాధికారులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వివరించారు.
ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే JEE, NEET వంటి వేర్వేరు ప్రవేశ పరీక్షలను భర్తీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కామన్ టెస్ట్ విధానంలో మెడికల్ అభ్యర్థులకు బయాలజీ, ఇంజినీరింగ్ అభ్యర్థులకు మ్యాథమెటిక్స్ అనే వేర్వేరు సెక్షన్లు ఉండేలా పరీక్ష నమూనాను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానానికి కమిటీలో గణనీయమైన మద్దతు లభించినట్లు తెలుస్తోంది.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. NEET పరీక్షకు ప్రయత్నాల సంఖ్యపై పరిమితులు, వయోపరిమితి విధించే అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. మల్టీ సెషన్, మల్టీ స్టేజ్ పరీక్షల విధానాన్ని కూడా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీని ద్వారా పరీక్షల నిర్వహణలో మరింత సౌలభ్యం, భద్రత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
2026 NEET-UG ప్రశ్నాపత్రం లీక్ ఘటన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై తీవ్ర విమర్శలు రావడంతో సంస్కరణలపై చర్చ వేగం అందుకుంది. NTA డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరై పరీక్షల నిర్వహణ, భద్రతా చర్యలు, సంస్కరణలపై వివరాలు సమర్పించారు.
పరీక్షలలో అవకతవకలు జరగకుండా ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియలో యాక్సెస్ పరిమితం చేయడం, బాహ్య సంస్థలపై ఆధారాన్ని తగ్గించడం, సొంత సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ వ్యవస్థలను అభివృద్ధి చేయడం వంటి చర్యలను NTA చేపడుతోందని కమిటీకి తెలిపారు.పరీక్షల భద్రత, వ్యవస్థలో ఉన్న లోపాలు, బాధ్యత వహించే అధికారులపై కమిటీ సభ్యులు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తినట్లు సమాచారం. భవిష్యత్తులో లీకులు జరగకుండా కఠిన భద్రతా చర్యలు అవసరమని సూచించారు.
అలాగే NEET-UG పరీక్షను వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. "సిస్టమ్ను పూర్తిగా ఫూల్ప్రూఫ్గా మార్చేందుకు భద్రతా ప్రోటోకాల్స్ను బలోపేతం చేస్తున్నాం" అని అధికారులు కమిటీకి తెలిపారు.
2026 మే 3న దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లో 14 నగరాల్లో నిర్వహించిన NEET-UG పరీక్షకు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను మే 12న రద్దు చేయగా, దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తిరిగి పరీక్షను జూన్ 21న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.ఈ మొత్తం వ్యవహారంపై CBI దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యుల్ని గుర్తించి వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.భవిష్యత్తు నిర్ణయాలు విద్యార్థులు, నిపుణులు, ఇతర భాగస్వాములతో సంప్రదింపుల తర్వాతే తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది.
ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల కోసం ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఉన్నతాధికారులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వివరించారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే JEE, NEET వంటి వేర్వేరు ప్రవేశ పరీక్షలను భర్తీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

