Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్ లో ధోనీ. ఇదే ఫైనల్ ఆన్సరా?

ఐపీఎల్ లో ధోనీ. ఇదే ఫైనల్ ఆన్సరా?

Gulte.com 5 days ago

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చెపాక్ మైదానంలో వరుసగా చేదు జ్ఞాపకాలు మిగిలేలా ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడమే కాకుండా, ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్ ఆడటంపై వచ్చిన ఒక అప్‌డేట్ ఫ్యాన్స్ గుండెల్ని పిండేస్తోంది.

గాయం కారణంగా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని 44 ఏళ్ల ధోనీ, చెపాక్‌లో జరిగిన చివరి మ్యాచ్ ముగిశాక గ్రౌండ్ లోకి వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. ఈ సమయంలో మాజీ ఆటగాడు సురేష్ రైనాతో ధోనీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ్యాచ్ తర్వాత కామెంటేటర్‌గా ఉన్న రైనా, ధోనీని కలిసి వచ్చే ఏడాది ఐపీఎల్ 2027 సీజన్ ఆడాలని కోరాడు. “ఈ ఏడాది గాయం వల్ల నువ్వు ఆడలేదు కాబట్టి ఇది లెక్కలోకి రాదు, వచ్చే సీజన్ ఖచ్చితంగా ఆడాలి” అని రైనా అనగా.. ధోనీ దానికి బదులిస్తూ “నా శరీరం ఇప్పుడు సహకరించడం లేదు, కాస్త బలహీనపడింది” అని చెప్పాడు. ఇన్నేళ్లుగా ధోనీని మైదానంలో సిక్సర్లు కొడుతూ చూసిన అభిమానులకు, అతని నోట నుంచి వచ్చిన ఈ సమాధానం తీవ్ర నిరాశను మిగిల్చింది. వయసు పైబడటం, ఫిట్‌నెస్ సమస్యల వల్లే అతను ఈ నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతోంది.

ధోనీ సమాధానంపై రైనా స్పందిస్తూ.. తాము ఈ మాటలను నమ్మడం లేదని, వచ్చే ఏడాది అతను ఖచ్చితంగా పునరాగమనం చేయాలని కోరినట్లు తెలిపాడు. అయితే ఇదంతా ధోనీ వ్యక్తిగత నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని, జట్టు ప్రస్తుతం యువ ఆటగాళ్లతో బాగానే ఎదుగుతోందని రైనా అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్ మొత్తం ధోనీ కేవలం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమైనా, మైదానం వెలుపల ఉంటూ యువ క్రికెటర్లకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాడు.

అటు చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ధోనీ భవిష్యత్తుపై స్పందించాడు. వచ్చే సీజన్‌లో ధోనీ మెంటార్‌గా ఉంటాడా లేక ప్లేయర్‌గా వస్తాడా అనేది పూర్తిగా ఫ్రాంచైజీ యాజమాన్యం తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పాడు. ఈ ఏడాది ధోనీ జట్టుతో కలిసి ప్రయాణించడం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడిందని, మ్యాచ్‌లు ఆడకపోయినా జట్టుపై అతని ప్రభావం చాలా బలంగా ఉందని ఫ్లెమింగ్ గుర్తు చేశాడు. చెన్నై జట్టు భవిష్యత్తు తరం కోసం కొత్త ఆటగాళ్లను తయారు చేసే పనిలో ఉందని క్లారిటీ ఇచ్చాడు.

సన్‌రైజర్స్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలు దెబ్బతిన్నప్పటికీ, అభిమానుల ఫోకస్ మొత్తం ధోనీ పైనే ఉండిపోయింది. చెపాక్ మైదానంలో ధోనీ చివరిసారిగా ల్యాప్ ఆఫ్ ఆనర్ (మైదానం చుట్టూ తిరగడం) చేస్తుంటే స్టేడియం మొత్తం భావోద్వేగంతో నిండిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu