ఏపీలో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల సంఖ్య దాదాపు 88 వరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రాల వారిగా ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా చెప్పిన లెక్కల ప్రకారం..
సగం నియోజకవర్గాలు పెరగనున్నాయి. దీంతో ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలు.. ఏకంగా 263 కు చేరనున్నాయి. సరే.. పెరిగేవి.. తరిగేవి ఎలా ఉన్నా.. కొన్ని కొన్ని కీలక ప్రాంతాలపై తనదైన ముద్ర వేసేలా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
గతంలో 1997లో ఆయన పాలన చేసినప్పుడు.. `జన్మభూమి` వంటి కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా `శ్రమదానం` వంటివి కూడా చేపట్టి.. సమాజంలో మార్పు తెచ్చేదిశగా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే జన్మభూమి పేరును చిరస్థాయిగా ప్రజలు గుర్తుంచుకునేలా.. అప్పటి కేంద్రంతో మాట్లాడి.. ఆయన విశాఖ-సికింద్రబాద్ మధ్య నడిచే రైలుకు జన్మభూమి ఎక్స్ప్రెస్గా పేరు పెట్టించారు. ఇప్పటికీ ఈ రైలు ప్రయాణం కొనసాగుతోంది.
ఇలానే.. `అమరావతి` రాజధాని విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంటున్నారని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల చంద్రబాబు పార్లమెంటులో అమరావతి బిల్లు పాసైన అనంతరం.. పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో కొందరు.. నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ప్రస్తావించారు. అమరావతి రాజధానిని అసెంబ్లీ నియోజకవర్గంగా మార్చాలని కొందరు ప్రతిపాదించారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మంచి ఆలోచన అని కితాబు కూడా ఇచ్చారు.
దీంతో వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పెంపు ఉంటున్న నేపథ్యంలో రాజధాని అమరావతిని అసెంబ్లీ నియోజకవర్గంగా మార్చే ప్రతిపాదనపై ఆయన కసరత్తు చేస్తున్నట్టు కీలక నేత ఒకరు వెల్లడించారు. తద్వారా రాజధాని పేరు.. జాతీయస్థాయి ఎన్నికల సంఘం రికార్డుల్లోనూ కనిపిస్తుందని.. అప్పుడు ఇక, రాజధానులను మార్చే దుస్థితి తప్పుతుందని ఆయన అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి ప్రతిపాదన చేయాలనే విషయంపై స్థానిక ఎమ్మెల్యేలతో ఆయన చర్చించనున్నారని తెలిసింది. ప్రస్తుతం దేశంలో గాంధీనగర్(గుజరాత్ రాజధాని) అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంది. ఒకవేళ ఇది సాధ్యమైతే ఆ నియోజకవర్గం సీటు కోసం మినీ యుద్ధమే జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

