Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

Gulte.com 2 weeks ago

త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.

దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమలో అటు వైసీపీ, ఇటు టీడీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత 2024 ఎన్నికల తర్వాత.. వైసీపీ ప్రభావం తగ్గిపోయిందని ప్రచారం ఉంది.

ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో మునిసిపాలిటీ అయినా.. పంచాయతీ అయినా.. ఏ ఎన్నిక అయినా.. ఏకగ్రీవాలు కాకుండా చూసుకోవాలని వైసీపీ అధినేత ఆ పార్టీ నేతలకు పదే పదే చెబుతున్నారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు అయితే.. దానికి స్థానిక ఇంచార్జులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను బాధ్యులను చేయాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. ఇక, త్వరలోనే జిల్లాల వారీగా దీనిపై సమీక్ష చేయనున్నారు.

ఇక, టీడీపీ విషయానికి వస్తే.. అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆమేరకు ప్రజల నుంచి మద్దతు కూడగట్టుకునేలా.. ఎక్కువగా పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ఏకగ్రీవాలు చేయాలని మంత్రి నారా లోకేష్ తేల్చి చెబుతున్నారు. ఎక్కడా ఈ విషయంలో నాయకులు వెనుకడుగు వేయొద్దని కూడా చెబుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి వంటివాటిని ముందుకు తీసుకువెళ్లేందుకు ఏకగ్రీవాలు అయితేనే మంచిదని వైసీపీ కి స్థానం ఇవ్వకుండా ప్రజలను మెప్పించేలా ఏకగ్రీవాలకు ప్రయత్నించాలని ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా వైసీపీ ఈ వ్యవహారాన్ని తప్పుబడుతోంది. రాష్ట్రంలో పోటీ పార్టీ ఉన్నప్పుడు ఏకగ్రీవాలు ఎలా చేస్తారని సజ్జల రామకృష్నారెడ్డి ప్రశ్నిస్తున్నారు. దీనిని తాము అడ్డుకుంటామని చెబుతున్నారు. కానీ.. ఒక్కసారి 2021లో అంటే.. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. జరిగిన సంగతులను గమనిస్తే.. అప్పట్లో అన్నీ ఏకగ్రీవాలే చేయాలంటూ.. మంత్రులకు టార్గెట్లు పెట్టి మరీ చేయించారన్నది తెలిసిందే. దీంతో టీడీపీ ఏకంగా పంచాయతీ ఎన్నికల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది.

నాడు అన్నీ వైసీపీ ఏకగ్రీవాలు చేసుకుంది. కనీసం నామినేషన్ కూడా వేయకుండా ప్రత్యర్థులను బెదిరించి కేసులు పెట్టించిందన్న వాదన ఉంది. కానీ, ఇప్పుడు మాత్రం ఏకగ్రీవాలను తప్పుబడుతుండడం గమనార్హం. అయితే.. వారు-వీరు అనే మాటలు పక్కన పెడితే.. ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలు ఎప్పుడూ మంచిది కాదు. ప్రజలు ఎన్నుకొనే నాయకులతోనే మేలు జరుగుతుందని ప్రజాస్వామ్య వాదులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu