Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అవసరమైతే కారుణ్య మరణం. కుక్కల దాడిపై సంచలన తీర్పు!

అవసరమైతే కారుణ్య మరణం. కుక్కల దాడిపై సంచలన తీర్పు!

Gulte.com 5 days ago

దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు అవసరమైతే చట్టప్రకారం కారుణ్య మరణం ప్రసాదించవచ్చని స్పష్టం చేసింది.

అంటే నొప్పి తెలియకుండా ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాలు తీసేయడం. ఈ మేరకు గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను సవరించడానికి నిరాకరిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ప్రజలకు రక్షణ కల్పించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సరైన మౌలిక వసతులు నిర్మించకపోవడాన్ని తప్పుబట్టింది.

ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నప్పుడు అధికారులు చట్టపరంగా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. ముఖ్యంగా విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల వంటి సంస్థల ప్రాంగణాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. గతంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేశాక మళ్లీ అదే ప్రాంగణాల్లో వదిలేసేవారు. అయితే అలా చేయడం వల్ల ప్రభుత్వ ఆశయం దెబ్బతింటుందని, కాబట్టి వాటిని మళ్లీ అదే సంస్థల పరిధిలోకి వదలకుండా వేరే చోటికి తరలించాలని పక్కాగా పేర్కొంది.

చిన్న పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులు వీధి కుక్కల బారిన పడుతున్న చేదు నిజాలను తాము విస్మరించలేమని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కుక్కల భయం లేకుండా స్వేచ్ఛగా, గౌరవంగా బతకడం కూడా రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు పరిధిలోకే వస్తుందని గుర్తు చేసింది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా AWBI రూపొందించిన నిబంధనలను సవరించాలంటూ వచ్చిన అభ్యర్థనలను కోర్టు తోసిపుచ్చింది.

ఈ సమస్య కేవలం నివాస ప్రాంతాలకే పరిమితం కాకుండా ఢిల్లీ విమానాశ్రయం వంటి రద్దీ ప్రదేశాలకు కూడా పాకడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఒక జర్మన్ పర్యాటకుడు కుక్క కాటుకు గురైన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఇలాంటి ఘటనల వల్ల అంతర్జాతీయంగా మన నగరాల పాలన, పౌర పరిపాలనపై ప్రజల్లో నమ్మకం సడలుతుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. కుక్కల జనాభాను నియంత్రించడంలో స్థానిక సంస్థల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు కలవరపెట్టే రీతిలో పెరుగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జంతువుల హక్కుల కంటే మనుషుల ప్రాణాల రక్షణే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu