Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'బౌండరీలు' దాటుతున్న టికెట్ రేట్లు!

'బౌండరీలు' దాటుతున్న టికెట్ రేట్లు!

Gulte.com 1 week ago

పీఎల్‌-2026లో అత్యధిక క్రేజ్‌ దక్కించుకున్న మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు టికెట్ విక్రయాలు ప్రారంభమైన వెంటనే అభిమానుల ఆగ్రహం వెల్లువెత్తింది.

భారీ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని టికెట్ ధరలను అసాధారణ స్థాయిలో పెంచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు లక్షల సంఖ్యలో అభిమానులు ఆన్‌లైన్ క్యూలో నిలిచినా, కొద్ది నిమిషాల్లోనే 'సోల్డ్ ఔట్' అని చూపించడం వివాదానికి దారితీసింది.

'కోహ్లీ ఫ్యాక్టర్'తో పెరిగిన క్రేజ్‌

ఆర్సిబి అంటేనే విరాట్ కోహ్లీ. తెలుగు రాష్ట్రాల్లోనూ కోహ్లీకి ఉన్న విపరీతమైన అభిమాన గణం కారణంగా హైదరాబాద్‌లో జరిగే ప్రతి ఆర్సిబి మ్యాచ్‌కు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ప్లేఆఫ్ సమీకరణాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

దీంతో వేలల్లో కాకుండా లక్షల్లో అభిమానులు టికెట్ల కోసం పోటీపడ్డారు. గురువారం సాయంత్రం 5 గంటలకు అధికారిక 'డిస్ట్రిక్ట్' యాప్‌లో బుకింగ్ ప్రారంభం కాగా, కొన్ని నిమిషాల్లోనే క్యూలో 2.6 లక్షల మందికి పైగా కనిపించారు. పలువురు అభిమానుల ప్రకారం ఒక దశలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే నమోదైంది. అయితే గంటల తరబడి వేచి చూసిన తర్వాత కూడా చాలా మందికి టికెట్లు దొరకలేదు.

భారీగా పెరిగిన టికెట్ ధరలు
ఈ మ్యాచ్‌కు టికెట్ ధరలను గత మ్యాచులతో పోలిస్తే 50 నుంచి 80 శాతం వరకు పెంచినట్లు అభిమానులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా మధ్యతరగతి అభిమానులు కొనుగోలు చేసే గ్యాలరీ టికెట్ల ధరలే వేల రూపాయలకు చేరడం చర్చనీయాంశమైంది.

టికెట్ ధరల పెంపు ఇలా..

రూ.950 టికెట్ → రూ.2000

రూ.1500 టికెట్ → రూ.3000

రూ.1910 టికెట్ → రూ.3500

రూ.2500 టికెట్ → రూ.4500

రూ.4500 టికెట్ → రూ.6000

రూ.7000 టికెట్ → రూ.10,000

బాక్స్ టికెట్లు → రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు

"కుటుంబంతో మ్యాచ్ చూడాలంటే పదివేల నుంచి ఇరవై వేల వరకు ఖర్చవుతోంది. ఇది సాధారణ అభిమానులకు అందని ద్రాక్షలా మారింది" అంటూ సోషల్ మీడియాలో పలువురు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

'సోల్డ్ ఔట్'పై అనుమానాలు
టికెట్ విక్రయాల ప్రక్రియపై కూడా అభిమానులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్యూలో లక్షల మంది ఉండగానే కొద్ది సేపట్లోనే 'సోల్డ్ ఔట్' అని చూపించడం వెనుక పారదర్శకత లేదని ఆరోపిస్తున్నారు. "టికెట్లు నిజంగా అభిమానులకు అమ్ముతున్నారా? లేక ముందుగానే బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారా?" అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొంతమంది అభిమానులు ఇప్పటికే బ్లాక్ మార్కెట్‌లో రెండింతల ధరలకు టికెట్లు ఆఫర్ చేస్తున్నారని చెబుతున్నారు. అధికారిక ధర కంటే ఎక్కువకు టికెట్లు విక్రయిస్తున్న స్క్రీన్‌షాట్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి.

వ్యాపారమవుతోన్న క్రికెట్‌?
ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు అభిమానులకు వినోదాన్ని చేరువ చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభమైన టోర్నీ, ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ మోడల్‌గా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్లు పాల్గొనే మ్యాచ్‌లను 'ప్రీమియం ఈవెంట్‌'గా మార్చి టికెట్ ధరలను అమాంతం పెంచుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, స్టేడియం సామర్థ్యం పరిమితంగానే ఉండటం, డిమాండ్ భారీగా పెరగడం వల్ల ధరలు పెరగడం సహజమే అయినా.. అందుబాటు ధరల్లో కొంత కోటా కేటాయించడం అవసరమని అంటున్నారు. లేదంటే స్టేడియంలో మ్యాచ్ చూడటం సామాన్య అభిమానులకు అసాధ్యంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

అధికారుల స్పందన ఏంటి?
టికెట్ ధరల పెంపు, బ్లాక్ మార్కెట్ ఆరోపణలపై ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అధికారికంగా స్పందించలేదు. అయితే అభిమానులు మాత్రం విక్రయాల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్ విక్రయాలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. మరోవైపు మే 22న జరిగే ఈ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోంది. ప్లేఆఫ్ అవకాశాల దృష్ట్యా ఇరు జట్లకూ ఈ పోరు కీలకంగా మారే అవకాశం ఉండటంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu