మనం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఎవరికీ ఎలాంటిఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా.. జగన్ను కొందరు కలుస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..?
ఎవరు తప్పు చేశారు? ఎక్కడ జరిగింది? అంటూ.. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అంతేకాదు.. అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని చెప్పాలని కూడా ఆయన ఆదేశించారు. దీంతో అసలు విషయంపై పెద్ద ఎత్తున ప్రభుత్వంలో చర్చకు దారితీసింది.
ఏం జరిగింది?
రాష్ట్ర వ్యాప్తంగా 9 విశ్వవిద్యాలయాల్లోని 1543 పోస్టులను భర్తీచేసేందుకు ఆయా విశ్వవిద్యాలయాలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఇవన్నీ.. బోధనకు సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులే కావడం గమనార్హం. వీటికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే.. ఈ పోస్టుల నియామకంలో దివ్యాంగుల కోటాను ప్రకటించకపోవడం.. వివాదానికి దారి తీసింది. సహజంగానే ప్రభుత్వ పోస్టుల విషయంలో దివ్యాంగులకు కూడా రిజర్వేషన్ కల్పిస్తారు. 2-3 శాతం వరకు వారికి రిజర్వేషన్ అమలు చేస్తున్నారు.
కానీ, తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో దివ్యాంగుల రిజర్వేషన్ను ఎక్కడా ప్రకటించలేదు. దీంతో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల అసోసియేషన్ ప్రతినిధులు తాజాగా వైసీపీ నేత, మాజీ సీఎం జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము అన్యాయానికి గురవుతున్నామని.. నిబంధనల మేరకు తమకు రిజర్వేషన్ కల్పించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. ఆయన ముందు చెప్పారు. అయితే.. వారికి జగన్ నుంచి తక్షణ ఉపశమనం లభించకపోయినా.. ఈ వ్యవహారం.. ప్రభుత్వంపై విమర్శలు వచ్చేలా చేసింది. సోషల్ మీడియాలో జగన్ను కలిసిన దివ్యాంగుల ఫొటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
ఈ వ్యవహారంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. తప్పు ఎక్కడ జరిగింది? అనే విషయంపై ఆరా తీశారు. వాస్తవానికి రిజర్వేషన్ ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై క్లారిటీ ఉందా? అని ప్రశ్నించినట్టు తెలిసింది. రాజకీయంగా దీనిని చూస్తే.. వదిలేయాలని.. లేకపోతే, నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వకపోతే.. బాధ్యులు ఎవరో తనకు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దీనిపై సమగ్ర నివేదిక కోరినట్టు తెలిసింది. కాగా.. గత ఏడాది కాలంలో జగన్ను పలువురు కలవడం.. వారి సమస్యలను ప్రస్తావించడంపైనా లోకేష్ ఆరా తీశారు.

