తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుల ప్రభావం కొత్తేమీ కాదు. ఎంజీఆర్, జయలలిత నుంచి నేటి సీఎం విజయ్ వరకు సినీ రంగం చుట్టూనే అక్కడి రాజకీయాలు తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడు రాజకీయ పరిణామాలపై సూపర్స్టార్ రజనీకాంత్ స్పందించారు.
విజయ్ ముఖ్యమంత్రి కావడంపై తనకు అసూయ లేదని రజనీకాంత్ స్పష్టం చేశారు. "నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను. చాలా కాలం క్రితమే దూరమయ్యాను. అలాంటప్పుడు విజయ్ సీఎం అయ్యాడని నేను ఎందుకు అసూయపడతాను?" అని ప్రశ్నించారు.
అంతేకాకుండా "కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే అసూయపడేవాణ్ణేమో" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. విజయ్తో తనను పోల్చడం సరికాదన్నారు. "విజయ్ నాకు సమకాలికుడు కాదు. మా ఇద్దరి మధ్య 25 నుంచి 28 ఏళ్ల వయస్సు తేడా ఉంది" అని చెప్పారు.
"విజయ్పై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిన్న పొరపాటు కూడా ఆయనపై ప్రభావం చూపుతుంది" అని రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నందుకే విజయ్ను గెలిపించారని పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం ఎం.కె. స్టాలిన్ను కలవడంపై కూడా ఆయన స్పందించారు.
"స్టాలిన్ నాకు చాలా కాలంగా మంచి మిత్రుడు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. స్నేహపూర్వకంగానే కలిశాను. అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు" అని వివరించారు.
విజయ్ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించానన్న ప్రచారాన్ని రజనీకాంత్ ఖండించారు. "అలాంటి నీచ రాజకీయాలు నేను చేయను. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు" అని స్పష్టం చేశారు.
అలాగే విజయ్ విజయం తనను మొదట ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. "సింగిల్గా పోటీ చేసి రెండు ప్రధాన పార్టీలను ఓడించడం చిన్న విషయం కాదు. తమిళనాడు ప్రజలకు విజయ్ మంచి చేస్తాడనే నమ్మకం ఉంది" అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.

