Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ ను ఇరికించబోయి జగన్ ఇరుక్కున్నారా?

పవన్ ను ఇరికించబోయి జగన్ ఇరుక్కున్నారా?

Gulte.com 4 days ago

రక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారు అన్న సామెత ఇప్పుడు ఏపీలోని విపక్షం వైసీపీకి సూటిగా సరిపోతుందని చెప్పాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎలాగైనా జైలుకు పంపించి..

ఎన్నికల్లో ఇక ఆయన ప్రస్తావన లేకుండా చేద్దామని కూటమి పార్టీలు ఆలోచిస్తున్నాయని, అందులో భాగంగా కేంద్రంలోని ఎన్డీఏ రథసారథి బీజేపీకి చెందిన కీలక నేతలతో కూటమి పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారని, అయితే ఆ చర్చలు అంతగా ఫలప్రదం కావడం లేదని వైసీపీ అనుకూల విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకే తెర లేపింది. ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీ మెడకే చుట్టుకున్న వైనం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

జగన్ ను అరెస్టు చేయించే దిశగా జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసినట్లుగా నాగేశ్వర్ చెప్పిన సంగతి తెలిసిందే. జగన్ అరెస్టును పవన్ నోట నుంచి విన్న అమిత్ షా… తమకు జగన్ చిరకాల మిత్రుడని, చంద్రబాబు మాత్రం పార్ట్ టైం మిత్రుడు మాత్రమేనని చెప్పారని నాగేశ్వర్ కథనం అల్లేశారు.

అంతేకాకుండా జగన్ అరెస్టు చంద్రబాబుకు అవసరం కావొచ్చు… దానితో మీకేం పని అని కూడా పవన్ ను అమిత్ షా ప్రశ్నించినట్లు నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. ఈ విషయాలు జనసేన కోర్ కమిటీ సమావేశంలో చర్చకు రాగా… ఆ సమావేశంలో పాలుపంచుకున్న వారే తనకు చెప్పారంటూ నాగేశ్వర్ చెప్పిన విషయం తెలిసిందే.

ఇదే అంశాన్ని పక్కాగా వినియోగించుకున్న వైసీపీ వైరి వర్గాలు… బీజేపీని మతతత్వ పార్టీగా అభివర్ణించిన జగన్… అదే పార్టీకి శాశ్వత మిత్రుడిగా ఉన్న విషయాన్ని అమిత్ షాతోనే చెప్పించారని చెబుతున్నాయి. అంతేకాకుండా జనానికి తెలియని ఈ వాస్తవాన్ని స్వయంగా వైసీపీ అనుకూల విశ్లేషకులే ఇప్పుడు ఇలా బయటపెట్టారని, జగన్ నిజ నైజం ఇదంటూ కూటమి పార్టీల అనుకూల వర్గాలు దెప్పి పొడుస్తున్నాయి.

అంతేకాకుండా… తాను బీజేపీతో కలవనే కలవనంటూ ముస్లింల ఓట్లన్నీ గంపగుత్తగా జగన్ వేయించుకున్నారని, ఇప్పుడు ముస్లింలకు వైసీపీనే సమాధానం చెప్పాల్సి ఉందని కూడా ఆ వర్గాలు వాదిస్తున్నాయి.

ఇదిలా ఉంటే… ప్రొఫెసర్ నాగేశ్వర్ తో ఈ కథను అల్లించి మరీ ఆయన చేతే చెప్పించింది మరోవరో కాదని, స్వయంగా వైసీపీ అధిష్ఠానమేనని ఆ పార్టీకి చెందిన మరో అనుకూల విశ్లేషకుడు పాషా వాదిస్తున్నారు.

అంటే… జనసేనతో పాటు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను బద్నాం చేయాలని ప్లాన్ వేసిన వైసీపీ చివరాఖరుకు తానే బోనులో చిక్కుకుని గిలగిలా కొట్టుకుంటోందన్న వాదనలు అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరినో ఇరికించబోయిన వైసీపీ తానే అడ్డంగా బుక్కైన తీరుపై ఇప్పుడు పెద్ద చర్చలే నడుస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu