ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత నెలలో హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడం, ఆయనకు అత్యవసరంగా శస్త్ర చికిత్స జరగడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
ఆయన అనారోగ్యంపై రకరకాల వార్తలు వచ్చాయి. అందరూ శస్త్ర చికిత్స అని రిపోర్ట్ చేశారే కానీ.. అసలు సమస్య ఏంటి, దేనికి సర్జరీ జరిగిందనే విషయం మాత్రం ఎవ్వరూ చెప్పలేదు.
తర్వాత ఆస్తమాకు శస్త్ర చికత్స జరిగినట్లు వార్తలు వచ్చాయి కానీ.. వాటి మీదా స్పష్టత లేదు. ఐతే ఈ విషయంపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించారు. జనసేన నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో తన అనారోగ్యం, సర్జరీ గురించి పవన్ స్పందించాడు.
తన ఆరోగ్యం గురించి అందరూ అడుగుతున్నారని.. అసలేమైందో చెబుతా అంటూ తనకున్న సమస్యలన్నింటినీ చెప్పుకొచ్చాడు పవన్. కరోనా సమయంలో తనకూ కొవిడ్ వచ్చిందని.. దాని వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి సమస్య తలెత్తిందని పవన్ వెల్లడించాడు. ఇక ఎన్నికల కోసం బాగా తిరగడం వల్ల దుమ్ము అంతా లోపలికి వెళ్లి సైనస్ సమస్య తలెత్తిందని.. ఆ దుమ్మంతా గట్టిపడి రాయిలాగా మారిందని పవన్ తెలిపాడు.
దీని వల్ల తనకు ఇటీవల దూరంలో ఉన్న వస్తువులను చూడలేని పరిస్థితి తలెత్తిందని.. అప్పుడు తీవ్రత అర్థమై భీమవరంలో ఒక ప్రోగ్రాంలో పాల్గొనాల్సిన వాడిని.. అత్యవసరంగా హైదరాబాద్కు వెళ్లి అన్ని పరీక్షలూ చేయించుకున్నానని.. అప్పుడు చాలా విషయాలు బయటపడ్డాయని పవన్ వెల్లడించాడు.
రెండు భుజాల మధ్య చిన్న చీలక వచ్చినట్లు వైద్యులు గుర్తించి ఇది ఎలా జరిగిందని అడిగితే.. తన అభిమానులు ప్రేమతో భుజాలు లాగేస్తుంటారని.. షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు అంత ఈజీగా వదలరని.. ఇటు అటు ఉన్న వాళ్లు లాగినపుడు ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులకు చెప్పినట్లు పవన్ తెలిపాడు.
తనకు వెన్నుపూసలోనూ సమస్య ఉందని.. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ.. గతంలో స్పోర్ట్స్ కోసం ట్రైనింగ్ తీసుకుని ఉండడంతో ఎంత నొప్పినైనా తన శరీరం భరిస్తుందని.. నొప్పిని గుర్తించడం కూడా కష్టమవుతుందని చెప్పాడు పవన్. ఐతే అభిమానుల వల్ల గాయాలైనా..మందు వేసేది కూడా వాళ్ల ప్రేమే అంటూ ఆడిటోరియాన్ని హోరెత్తించాడు పవన్. తన కోసం ప్రార్థించిన అందరికీ పవన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాడు.

