Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయనగరం టీడీపీలో షాడోల కలకలం.. !

విజయనగరం టీడీపీలో షాడోల కలకలం.. !

Gulte.com 4 days ago

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయనగరం కోటకు ఒక ప్రత్యేకమైన చరిత్ర, హుందాతనం ఉన్నాయి. పూసపాటి రాజుల రాజకీయ వారసత్వం ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం సాగుతుందనే పేరుంది.

కానీ, ప్రస్తుతం విజయనగరం నియోజకవర్గంలో నడుస్తున్న రాజకీయాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. అక్కడ వినిపిస్తున్న షాడో పాలిటిక్స్ వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పైకి కనిపిస్తున్న అధికార ముద్ర ఒకరిదైతే… తెర వెనుక అసలు చక్రం తిప్పుతోంది వేరే వాళ్లనే ప్రచారం స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు నియోజకవర్గ వ్యవహారాలను చక్కబెడుతున్నప్పటికీ, ఆమె చుట్టూ ఇద్దరు అనధికార వ్యక్తులు ఒక ప్రత్యేక కూటమిగా ఏర్పడ్డారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎలాంటి రాజకీయ బలం లేని ఆ ఇద్దరు నేతలు, ఇప్పుడు నియోజకవర్గంలో తామే షాడో ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారట. ఎమ్మెల్యే కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా మారిన ఆ ఇద్దరి అనుమతి లేనిదే నియోజకవర్గంలో ఏ చిన్న ఫైల్ కూడా కదలడం లేదని స్వయంగా టీడీపీ కార్యకర్తలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

ఈ షాడో లీడర్లు వాడుతున్న ఒక వింత టెక్నిక్ ఇప్పుడు ప్రభుత్వ అధికారులను, సిబ్బందిని వణకిస్తోంది. తమ మాట వినని లేదా తమకు అనుకూలంగా లేని అధికారులపై వైసీపీ ముద్ర వేసి, వారిని కీలక స్థానాల నుంచి దూరంగా పంపించేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల విజయనగరం నగరపాలక సంస్థ లో ఒకేసారి 28 మంది ఉద్యోగులను బదిలీ చేయడం వెనుక ఈ షాడోల హస్తమే ఉందనే చర్చ గట్టిగా నడుస్తోంది. కేవలం మున్సిపాలిటీలోనే కాకుండా, పోలీస్ శాఖలో కూడా కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్‌స్పెక్టర్ల వరకు జరిగిన బదిలీల వెనుక వీరి ఒత్తిళ్లే పనిచేశాయనే ప్రచారం జోరందుకుంది.

అభిమాన పార్టీ అధికారంలోకి రాగానే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, కాంట్రాక్టుల కోసం స్థానిక కార్యకర్తలు ఆశపడటం సహజం. కానీ విజయనగరంలో రోడ్లు, కాలువల నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టు పనులు కూడా ఈ షాడో నేతలు సూచించిన వారికే దక్కుతున్నాయట. దీనివల్ల పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.

విజయనగరం రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజుకు ఒక ప్రత్యేక గౌరవం ఉంది. అవినీతికి తావులేని, పారదర్శక రాజకీయాలు చేయడం ఆయన శైలి. కానీ, ఇప్పుడు ఆయన కుమార్తె అదితి చుట్టూ చేరిన ఈ ఇద్దరు వ్యక్తుల నేపథ్యంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు గతంలో వైసీపీలో పనిచేసి వచ్చిన వ్యక్తి కాగా, మరొకరు సెటిల్మెంట్ల ద్వారా ప్రభావం పెంచుకున్న వ్యక్తని టాక్. అశోక గజపతిరాజు ఏ తరహా రాజకీయ విధానాలనైతే వ్యతిరేకించారో.. ఇప్పుడు సరిగ్గా అవే పద్ధతులు కోటలో నడుస్తుండటాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

“ఎమ్మెల్యేలారా.. మీ నియోజకవర్గాల్లో షాడో వ్యవస్థలను ప్రోత్సహించకండి, బంధువులను, అనుచరులను అధికారిక వ్యవహారాల్లోకి రానివ్వకండి” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ విజయనగరంలో మాత్రం ఆ హెచ్చరికలు అస్సలు అమలు కావడం లేదని స్పష్టమవుతోంది. ఈ షాడో వ్యవస్థల కారణంగా ఐదేళ్లు తిరగకుండానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం స్పందించి విజయనగరం టీడీపీలో నడుస్తున్న ఈ షాడోల రాజ్యానికి బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu