Dailyhunt
యువ దర్శకుడికి కోపమొచ్చింది

యువ దర్శకుడికి కోపమొచ్చింది

Gulte.com 1 week ago

చాలా తక్కువ బడ్జెట్లో, స్టార్ ఇమేజ్ లేని నటీనటులంతో నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తీసి తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్.

విషయం ఉన్న వాళ్లు ఎంత పరిమిత వనరులున్నా ప్రతిభ చాటుకోగలరని అతను రుజువు చేశాడు. ఆదిత్య నిర్మాతగా వ్యవహరించిన లిటిల్ హార్ట్స్ సినిమా సైతం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడతను తొలిసారి దర్శకుడిగా ఫీచర్ ఫిలిం చేస్తున్నాడు. అదే.. ఎపిక్. బేబీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ చేసిన సినిమా ఇది. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ లాంచ్ అయింది. అది యువత ఆకట్టుకునేలా సరదాగా, రొమాంటిగ్గా సాగి ఆకట్టుకుంది. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆదిత్యకు ఒక ఫిలిం జర్నలిస్టు వేసిన ప్రశ్న ఒకింత ఆగ్రహం తెప్పించింది. అతను స్టేజ్ మీద తన ఫ్రస్టేషన్‌ను దాచుకోలేకపోయాడు.

బేబీ సినిమాలో నటనకు గాను వైష్ణవి చాలా మంచి పేరు సంపాదించినా, ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నా.. ఆ తర్వాత ఆమె కెరీర్ ఆశించినట్లుగా సాగట్లేదు. ఈ నేపథ్యంలో బేబీతో వచ్చిన ఇమేజ్ నుంచి వైష్ణవికి మేకోవర్ అవసరమా అని ఒక జర్నలిస్టు ప్రశ్నించాడు. అందుకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని వైష్ణవి.. తన చేతిలో ఉన్న మైక్‌ను ఆదిత్యకు అందించింది. అతను ఈ ప్రశ్నకు చాలా సీరియస్ అయి.. ఎదురు ప్రశ్న వేశాడు.

అసలు ఆమెకు మేకోవర్ అవసరం అని ఎవరు కోరుకుంటున్నారు.. దీన్ని ఎవరు డిసైడ్ చేస్తారు అని ప్రశ్నించాడు. ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు అని అడిగితే.. అలా అని ఎవరు చెప్పారు అని అడిగాడు ఆదిత్య. ఒక్కసారిగా ఆదిత్య సీరియస్ అయిపోవడంతో.. హీరో ఆనంద్ దేవరకొండ జోక్యం చేసుకుని వాతావరణాన్ని కూల్ చేసే ప్రయత్నం చేశాడు.

వైష్ణవి చేస్తున్న ప్రతి పాత్రా మేకోవరే అని.. ఎపిక్‌లో చేస్తున్న పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని.. ఈ సినిమాతో ఆమెను చూసే కోణం మారుతుందని అతనన్నాడు. ఐతే ఇప్పుడే కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న ఆదిత్య మరీ అంత సీరియస్ అయిపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. అలాంటి ప్రశ్నలకు ఇలాగే సమాధానం ఇవ్వాలని కొందరు అభిప్రాయపడితే.. కొందరు మాత్రం అతను అంత సీరియస్ అవ్వాల్సింది కాదని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gulte Telugu