Dailyhunt
AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

HashtagU Telugu 2 weeks ago

Chandrababu ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందబోతోందని, దీంతో పార్లమెంట్‌లో ఆమోద ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “గత ఐదేళ్లు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారు. అమరావతి అంటే సెంటిమెంట్, కానీ ఆ పేరు వింటేనే జగన్‌కు కంపరంగా ఉంటుంది. అందుకే నిత్యం విషం కక్కుతున్నారు. అమరావతి అని పలకడానికి కూడా ఇష్టపడక ‘మావిగన్’ అని వింత పేరుతో పిలుస్తున్నారు. గతంలో ‘ఎస్ఆర్ఎం అమరావతి’ అని ఉంటే దాన్ని ఎస్ఆర్ఎంగా మార్పించారు. అమరావతి పట్ల ఆయనకున్న ద్వేషం భవిష్యత్తులోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైంది” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

బిల్లు ఆమోదం పొందినందుకు ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో సంబరాలు జరపాలని కూటమి శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. తాను మధ్యాహ్నం రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం వెళ్లి వేడుకల్లో పాల్గొంటానని తెలిపారు. దేశంలోని పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన నీరు, మట్టి ఉన్న పవిత్ర ప్రాంతంలో సంకల్పం తీసుకుంటానని చెప్పారు.

“గతంలో ‘మీకు 3 రాజధానులా’ అని ఎగతాళి చేశారు. ఇప్పుడు ‘ఏకైక రాజధాని నా రాజధాని అమరావతి’ అని ప్రతి ఒక్కరూ గౌరవంగా చెప్పుకునే రోజు వచ్చింది. రాజధానికి స్థిరత్వం కల్పించిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాకు, మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు” అని చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను కూడా సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సాధించిన విజయమని మనోహర్ అభివర్ణించారు. సాయంత్రం జరిగే సంబరాల్లో జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొంటాయని వారు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HashtagU Telugu