Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CM Revanth Reddy: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

CM Revanth Reddy: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

HashtagU Telugu 1 week ago

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చడంతో పాటు, పంటల సాగు విధానంలో సమతుల్యతను సాధించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఒకవైపు వరి సాగు అసాధారణంగా పెరిగిపోతుండగా..

మరోవైపు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, చిరుధాన్యాల సాగు గణనీయంగా పడిపోతోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి, ఇతర ధాన్యాల దిగుమతి విషయంలో తెలంగాణను స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా, సాంప్రదాయ వరి సాగును పక్కనబెట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపే రైతులకు ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించింది.

స్వచ్ఛందంగా పంట మార్పిడి చేసే రైతులకు ఎకరానికి రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు ప్రత్యేక బోనస్ లేదా ప్రోత్సాహకాన్ని అందించాలనే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ అంశంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పుష్కలంగా సాగునీటి లభ్యత ఉండటం, చెరువులు, ప్రాజెక్టులు నిండటం, ఫామ్‌గేట్ వద్దే ప్రభుత్వం నేరుగా మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఎక్కువగా వరి సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 500 అదనపు బోనస్ ఇస్తుండటంతో వరి సాగు రికార్డు స్థాయికి చేరింది.

అయితే వరి మాత్రమే సాగు చేయడం వల్ల మార్కెట్‌లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, పెసలు, కందులు, జొన్నలు, మొక్కజొన్నలు వంటి పప్పుధాన్యాల విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే విదేశాల నుంచి వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమలు వంటి నూనెగింజల సాగుకు ఈ రూ. 4-5 వేల ప్రోత్సాహకాన్ని వర్తింపజేయాలని నిపుణుల కమిటీలు ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు బోనస్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇక రైతు భరోసా పథకం విషయంలోనూ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. రైతు భరోసా నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు అధునాతన శాటిలైట్ మ్యాపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ సాంకేతికత ద్వారా రాష్ట్రంలో ఏ భూముల్లో పంటలు వేశారు, ఏయే రకాల పంటలు సాగు అవుతున్నాయనే పూర్తి వివరాలను డిజిటల్ రూపంలో సేకరిస్తారు. కేవలం నిజంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాగుకు పనికిరాని రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన కమర్షియల్ భూములకు రైతు భరోసాని పూర్తిగా నిలిపివేయనున్నారు.

ఈ ప్రక్షాళన చర్యల ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ. 2 వేల కోట్ల నుంచి రూ. 3 వేల కోట్ల వరకు ప్రజాధనం మిగులుతుందని అంచనా వేస్తున్నారు. అలా మిగిలిన నిధులను పూర్తిగా వ్యవసాయ రంగానికే మళ్లించి, రైతుల సంక్షేమం కోసం పంటల బోనస్, సమగ్ర పంటల బీమా వంటి పథకాలకు బడ్జెట్‌గా కేటాయించనున్నారు. నేడు జరగబోయే కేబినెట్ భేటీలో ఈ అంశాలతో పాటు ఆర్థిక వనరుల సమీకరణకు సంబంధించిన వీబీజీరామ్‌జీ నివేదిక అమలు, ఎస్‌బీఐ క్యాప్స్ సిఫారసులు వంటి పలు కీలక విషయాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, తుది మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HashtagU Telugu