Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రాణం తీసిన కొబ్బరి బొండం

ప్రాణం తీసిన కొబ్బరి బొండం

HashtagU Telugu 1 week ago

కొబ్బరిబొండం ఇద్దరి ప్రాణాలు తీసిన విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ కారు ప్రమాదంలో ఒక పురోహితుడు, మరో వ్యక్తి కన్నుమూశారు. కారు బ్రేకు, క్లచ్‌ మధ్యలో ఒక కొబ్బరిబొండం ఇరుక్కుపోయి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన దువ్వూరి హరిప్రసాద్ అనే వ్యక్తి పౌరోహిత్యం చేస్తుంటారు. హరిప్రసాద్ చిన్న కుమారుడి వివాహం గురువారం హైదరాబాద్‌లోని పెళ్లికూతురు ఇంట్లో జరిగింది.

వివాహ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత శుక్రవారం మధ్యాహ్న సమయంలో హరిప్రసాద్ కుటుంబసభ్యులు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఒక కారులో బయల్దేరారు. అలాగే హరిప్రసాద్, ఆయన బంధువు మరో కారులో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు విజయవాడ సమీపంలోని నల్లగుంట వద్దకు చేరుకోగానే హరిప్రసాద్ బంధువు కారు నుంచి దిగి వెళ్లారు. ఆ తర్వాత హరిప్రసాద్ తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ క్రమంలోనే గొల్లపూడి బైపాస్ రోడ్డు సమీపానికి రాగానే కారు అదుపు తప్పి మొదట ఒక బైక్‌ను, ఆ తర్వాత ఆగి ఉన్న కంటెయినర్‌ను బలంగా ఢీకొట్టింది.

కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టిన తర్వాత.. కారు వెనుక సీటులోని కొబ్బరిబొండం ఎగిరివచ్చి బ్రేక్, క్లచ్‌ మధ్య ఇరుక్కుందని.. దీంతో హరిప్రసాద్‌కు కారును అదుపు చేయడం సాధ్యం కాలేదని ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం పోలీసులు భావిస్తున్నారు. అందుకే కంటెయినర్‌ను ఢీకొట్టి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో హరిప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు హరిప్రసాద్ కారు బైక్‌ను ఢీకొట్టడంతో.. ద్విచక్రవాహనం వెనుక సీట్లో కూర్చున్న గురవయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.

విజయవాడలోని రాజీవ్‌నగర్‌కు చెందిన గురవయ్య మార్కాపురం జిల్లాలోని బోయమడుగుల వీఆర్‌ఏగా పనిచేస్తున్నారు. అయితే అనారోగ్యం కారణంగా గుంటూరులోని ఒక ఆసుపత్రిలో గురవయ్య శుక్రవారం వైద్యం చేయించుకున్నారు. ఆస్పత్రి వద్ద నుంచి కుమారుడు హరికృష్ణ బైక్ మీద విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలోనే హరిప్రసాద్ కారు ఢీకొట్టగానే గురవయ్య బైక్ మీద నుంచి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. గురవయ్య కుమారుడు హెల్మెట్ ధరించడంతో గాయాల నుండి బయటపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HashtagU Telugu