తిరుమల శ్రీవారి దర్శనం కోసం 116 ఏళ్ల బామ్మ కాలినడకన వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి నడక మార్గంలో వెళుతుండగా.. ఒక భక్తురాలు వీడియో తీసి పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది.
ఈ వీడియోపై ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ఆ బామ్మ 116 ఏళ్ల వయస్సులోనూ కాలినడకన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారని.. ఆ భక్తురాలి అచంచల భక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అంటూ టీటీడీ ఛైర్మన్ ట్వీట్ చేశారు. ఆ బామ్మతో పాటుగా ఆమె కుటుంబ సభ్యులకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్నారు. ఒకవేళ ఆమె వివరాలు ఎవరికైనా తెలిస్తే తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఆమెతో పాటుగా ఆమె కుటుంబానికి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్నారు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేసిన తర్వాత బామ్మ వివరాలు తెలిశాయి. తన విజ్ఞప్తిపై వెంటనే భక్తురాలి వివరాలు తెలిశాయన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారుల ద్వారా సమాచారం తెలిసిందని.. వారికి అభినందనలు తెలిపారు. ఆమె పేరు నవనీతమ్మ, తమిళనాడుకు చెందిన భక్తురాలు.. ఆమె ప్రస్తుతం తిరుపతి జీవకోనలోని బంధువుల దగ్గర ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇవాళ ఉదయం నవనీతమ్మ, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆమెకు ఈ భాగ్యం దక్కడం ఆనందంగా ఉందన్నారు. తిరుమల శ్రీవారి అనుగ్రహం ఆమెకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.
నవనీతమ్మ తిరుమలకు అలిపిరి నడకమార్గంలో వచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో అందరూ స్పందించారు. ఆమె వివరాల కోసం చాలామంది ప్రయత్నించినా దొరకలేదు. ఆమె కర్ణాటక నుంచి వచ్చారని ప్రచారం కూడా జరిగింది. టీటీడీ ఛైర్మన్ స్పందించడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆమె గురించి ఆరా తీశారు. అప్పుడు ఆమె తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తించబడ్డారు. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నవనీతమ్మ వీడియోను ట్వీట్ చేశారు. 'నిష్కల్మషమైన భక్తికి వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే.. ఈ 116 ఏళ్ల బామ్మ శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య దర్శనం కోసం కాలినడకన తిరుమల వరకు వెళ్లడం చూసి ఆశ్చర్యపోయాను. ఆమె విశ్వాసానికి ఆమె కుటుంబం మద్దతు ఇవ్వడం అద్భుతంగా ఉంది. నిజంగా స్ఫూర్తిదాయకం' అన్నారు చంద్రబాబు. మొత్తం మీద బామ్మ వివరాలు తెలిశాయి.. వీఐపీ బ్రేక్ దర్శనం కూడా దక్కింది.

