Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమర్‌నాథ్ యాత్ర షురూ: 4,800 మందితో బయల్దేరిన తొలి బృందం

అమర్‌నాథ్ యాత్ర షురూ: 4,800 మందితో బయల్దేరిన తొలి బృందం

మ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం ఉదయం భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి పవిత్ర శ్రీ అమర్‌నాథ్ జీ యాత్ర తొలి బృందాన్ని జెండా ఊపి పంపించారు.

మొత్తం 259 చిన్న, పెద్ద వాహనాల కాన్వాయ్‌లో 4,800 మందికి పైగా భక్తులు ఈ పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభించారు. భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ఆహార భద్రత కోసం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 57 రోజుల పాటు సాగే ఈ వార్షిక యాత్ర ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినం నాటితో ముగుస్తుంది.

దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో, సముద్ర మట్టానికి సుమారు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహను సందర్శించడం దేశంలోనే అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్రలలో ఒకటిగా భావిస్తారు. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని (బాబా బర్ఫానీ) దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.

రెండు మార్గాల్లో పవిత్ర యాత్ర

ఈ ఏడాది 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర జూలై 3 నుంచి అధికారికంగా రెండు మార్గాల్లో ఒకేసారి ప్రారంభం కానుంది. అనంత్‌నాగ్ జిల్లాలోని సాంప్రదాయ 48 కిలోమీటర్ల నున్వాన్-పహల్గామ్ మార్గం ఒకటి కాగా, గందర్బల్ జిల్లాలోని నిటారుగా ఉండే చిన్నదైన 14 కిలోమీటర్ల బాల్తాల్ మార్గం రెండోది.

భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి వ్యూహాత్మక జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొత్తగా మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా దిగ్డోల్ - పంథ్యాల్‌ను అనుసంధానించే 3.5 కిలోమీటర్ల పొడవైన టన్నెల్, రామ్‌సూ సమీపంలోని 810 మీటర్ల వయాడక్ట్‌లను అందుబాటులోకి తెచ్చారు. భక్తులు ఈ హైవే గుండా ప్రయాణించి పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకుంటారు. అక్కడ నుంచి మరుసటి రోజు కాలినడకన గుహ వైపునకు ప్రయాణం సాగిస్తారు.

రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు

వార్షిక అమర్‌నాథ్ యాత్రను దృష్టిలో ఉంచుకుని జమ్మూ రైల్వే డివిజన్ స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలను మెరుగుపరిచింది. భక్తుల రక్షణ, రద్దీ నిర్వహణ, ప్రాథమిక వసతుల కల్పనపైనే తమ ప్రధాన దృష్టి ఉందని రైల్వే అధికారులు తెలిపారు.

"అమర్‌నాథ్ యాత్ర ఈ ప్రాంతానికి, ప్రత్యేకించి జమ్మూకశ్మీర్‌కు అత్యంత కీలకమైన ఘట్టం. దీనికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం" అని జమ్మూ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉచిత్ సింఘాల్ తెలిపారు.

రైల్వే శాఖ మూడు ప్రధానాంశాలపై దృష్టి పెట్టిందని ఆయన వివరించారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ టికెట్ చెకింగ్ సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. స్టేషన్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం స్టేషన్ పునరాభివృద్ధి పనులు జరుగుతున్నందున, భక్తులకు ఇబ్బంది కలగకుండా సహాయం చేయడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. రైళ్ల రాకపోకల్లో మార్పులు, ఆలస్యం వంటి సమాచారాన్ని భక్తులకు ఎప్పటికప్పుడు అనౌన్స్‌మెంట్లు, బల్క్ ఎస్ఎమ్ఎస్ (SMS) అలర్ట్ల ద్వారా చేరవేస్తున్నామని సింఘాల్ వివరించారు.

లంగర్లలో ఆహార భద్రతపై నిఘా

భక్తులకు స్వాగతం పలికే ఏర్పాట్లలో భాగంగా జమ్మూకశ్మీర్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఖాలిద్ జహంగీర్, జాయింట్ కమిషనర్ (ఫుడ్ సేఫ్టీ) సంజీవ్ కుమార్, రాంబన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బల్బీర్ సింగ్‌లతో కలిసి బుధవారం చందర్‌కోట్ వద్ద ఉన్న లంగర్ (అన్నదాన కేంద్రం) సైట్‌ను సందర్శించి ఆహార భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

యాత్ర మార్గంలో ప్రత్యేక ఆహార భద్రతా బృందాలను మోహరించినట్లు ఖాలిద్ జహంగీర్ స్పష్టం చేశారు. "శ్రీ అమర్‌నాథ్ జీ యాత్ర కోసం మేం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాం. యాత్ర మార్గమంతటా భక్తులకు సురక్షితమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించేలా లంగర్లు, ఇతర ఆహారశాలలను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను నియమించాం" అని ఆయన వివరించారు.

Praveen Kumar Lenkala

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu