Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP Sadarem Certificate: జులై 8 నుంచి ఏపీ సదరం స్లాట్ బుకింగ్స్ పున:ప్రారంభం.. కొత్త రూల్స్ ఇవే!

AP Sadarem Certificate: జులై 8 నుంచి ఏపీ సదరం స్లాట్ బుకింగ్స్ పున:ప్రారంభం.. కొత్త రూల్స్ ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలకు అత్యంత కీలకమైన వైకల్య ధ్రువపత్రాల (సదరం - SADAREM) జారీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది.

ఈ సేవల్లో దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, పారదర్శకతను పెంచేందుకు సరికొత్త సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా దివ్యాంగులకు ప్రయాణ భారంతో పాటు, వైద్యులపై పనిభారం కూడా గణనీయంగా తగ్గనుంది.

జులై 8 నుంచి స్లాట్ బుకింగ్స్

గత కొంతకాలంగా నిలిచిపోయిన సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియ జులై 8 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అనంతరం, జులై 13 నుంచి అర్హులైన అభ్యర్థులకు వైద్యులు వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంతకుముందు సదరం స్లాట్ల కోసం దివ్యాంగులు ఎక్కడో దూరంగా ఉన్న జిల్లాలకు ప్రయాణించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని 6 జోన్లుగా విభజించింది.

ఇకపై దివ్యాంగులు తమ సొంత జోన్ పరిధిలోని జిల్లాల్లో మాత్రమే స్లాట్ బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. దీనివల్ల వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే పరీక్షలు ముగించుకోవచ్చు.

తప్పుడు బుకింగ్స్‌కు చెక్.. ఇవి ఉంటేనే స్లాట్

సదరం సేవల్లో అవినీతిని నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. స్లాట్ బుక్ చేసుకునే సమయంలో స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి. వైకల్య కేటగిరీ (ఉదాహరణకు: అంధత్వం, మూగ, చెవుడు, కాళ్ల వైకల్యం) పై స్పష్టత లేకపోతే, ముందస్తుగా ప్రభుత్వ డాక్టర్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ఉండాలి. పరీక్షా కేంద్రానికి వచ్చిన తర్వాత సదరం పోర్టల్‌లో ఆన్‌లైన్ హాజరు నమోదు చేయించుకోవాలి. హాజరు నమోదైతేనే సదరం ఐడీ (SADAREM ID) యాక్టివేట్ అవుతుంది.

ఏపీ సేవా పోర్టల్ ద్వారా బుకింగ్

దివ్యాంగులు ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, సదరం సేవలు 100 శాతం ఉచితమని ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులు ఏపీ సేవా పోర్టల్ (AP Seva Portal) లో తమ సిటిజన్ లాగిన్ ద్వారా ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ వాడటం రాని వారు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా కూడా ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు.

మీ మొబైల్‌లోనే స్లాట్ల లభ్యతను తెలుసుకునేందుకు 'మన మిత్ర' వాట్సాప్ సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సదరం సర్టిఫికేట్ మంజూరైన తర్వాత ఆన్‌లైన్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సదరం సర్టిఫికేట్ల పేరుతో దళారులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని, అధికారులకు ఫిర్యాదు చేయాలని మంత్రి దివ్యాంగులను కోరారు. ఈ సరికొత్త విధానంపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Anand Sai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu