ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటితే చాలు భానుడి భగభగలు మొదలవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు…
ఇవాళ 11 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మన్యం జిల్లాలోని భామినిలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఇక చిత్తూరు జిల్లాలోని రాయలపేటలో 41.4 డిగ్రీలు, అనకాపల్లి జిల్లాలోని నాతవరంలో 40.9 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లాలోని సిగడాంలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక నంద్యాల జిల్లాలోని ఆలమూరు, కడప జిల్లాలోని బద్వేల్ లో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఏలూరు జిల్లాలోని ధర్మాజీగూడెం, తిరుపతి జిల్లాలోని రేణిగుంట, విజయనగరం జిల్లాలోని రాజాంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలోని కంకిపాడులో 40.1 డిగ్రీలు, కర్నూలు జిల్లాలోని తోవి వద్ద 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
వడదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని పేర్కొంది. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తపడాలని హెచ్చరించింది.
ఇక రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. 43 నుంచి 45 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే సూచనలున్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని…. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్లకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచిస్తోంది.
Maheshwaram Mahendra Chary

