హిందూ ధర్మంలో పూజా కార్యక్రమాలకు సంబంధించి శాస్త్రాలు కొన్ని ప్రత్యేక నియమాలను నిర్దేశించాయి. పూజలో స్వచ్ఛత, శుభ్రతకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో మనందరికీ తెలిసిందే.
అందుకే పూజ గదిని శుభ్రం చేయడం దగ్గర నుంచి, దేవుడికి సమర్పించే నైవేద్యం వరకు ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్త వహిస్తాం. సాధారణంగా దేవుడికి సమర్పించే ప్రతి వస్తువును కడిగి లేదా శుద్ధి చేసి సమర్పించడం మన ఆచారం. కానీ, పువ్వుల విషయంలో మాత్రం ఈ నియమం భిన్నంగా ఉంటుందని మీకు తెలుసా? చాలా మంది పువ్వులపై దుమ్ము ఉంటుందని కడుగుతుంటారు, కానీ శాస్త్రం దీనిని వారించింది.
పువ్వులు.. భక్తుడి భావానికి చిహ్నం
పూజలో పువ్వులు సమర్పించడం అంటే కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది భక్తుడి ప్రేమకు, శ్రద్ధకు నిదర్శనం. ప్రకృతి ప్రసాదించిన అత్యంత కోమలమైన, పవిత్రమైన వస్తువు పువ్వు. మనలోని నిర్మలమైన భావాలను భగవంతుడికి నివేదించడానికి పువ్వులను సాధనంగా ఉపయోగిస్తాం. పువ్వుల నుంచి వచ్చే సహజ సిద్ధమైన సువాసన పూజా మందిరంలో సానుకూల శక్తిని (Positive Energy) నింపుతుంది. ఈ పరిమళం దైవత్వాన్ని ఆకర్షించడమే కాకుండా, భక్తుడి మనస్సును ఏకాగ్రత వైపు నడిపిస్తుంది.
పూలను ఎందుకు కడగకూడదు?
శాస్త్రాల ప్రకారం, దేవుడికి ప్రకృతి ఎలా ఇచ్చిందో అలానే సమర్పించాలి. పూలను నీటితో కడగడం వల్ల వాటి సహజ సిద్ధమైన సువాసన తగ్గిపోతుంది. దీనికి గల కొన్ని కారణాలు ఇక్కడ చూడండి:
సువాసన కోల్పోవడం: పువ్వులోని 'పరాగ రేణువులు' మరియు సహజ తైలాలు నీటితో కడిగినప్పుడు కొట్టుకుపోతాయి. దీనివల్ల పువ్వు తన సహజ పరిమళాన్ని కోల్పోతుంది.
కోమలత్వం దెబ్బతినడం: పువ్వులు చాలా సున్నితంగా ఉంటాయి. నీటి ధార తగిలితే రేకులు విడిపోవడం లేదా ముడుచుకుపోయే అవకాశం ఉంది.
వాడిపోవడం: నీటిలో తడిచిన పువ్వులు త్వరగా వాడిపోతాయి. దేవుడికి ఎప్పుడూ తాజాగా, వికసించిన పూలనే సమర్పించాలి.
లేదంటే వాటిని దేవుడికి సమర్పించడానికి ముందు కొన్ని నీళ్లు జల్లి శుభ్రం చేసి సమర్పించండి. కానీ ఎక్కువ నీళ్లతో వాటిని కడిగేస్తే సువాసన తగ్గిపోతుంది. ముడుచుకుపోతాయి.
ఏ దేవుడికి ఏ రంగు పువ్వులు?
ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది, అలాగే వారికి ఇష్టమైన రంగులు, పువ్వులు కూడా వేరుగా ఉంటాయి.
ఎరుపు: శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి ఎరుపు రంగు పూలు ఎంతో ఇష్టం. ఇది శక్తిని సూచిస్తుంది.
పసుపు: విష్ణుమూర్తికి, గురువులకు పసుపు రంగు పువ్వులు ప్రీతికరం. ఇది జ్ఞానానికి చిహ్నం.
తెలుపు: సరస్వతీ దేవికి, శివుడికి తెలుపు రంగు పువ్వులు శాంతిని ఇస్తాయి.
అయితే, పరమశివుడికి 'కేతకి' (మొగలి) పువ్వును సమర్పించకూడదనే నిషేధం శాస్త్రాల్లో ఉంది.
పువ్వులు కోసేటప్పుడు పాటించాల్సిన నియమాలు
కేవలం పూజ చేయడమే కాదు, పూలు కోసే పద్ధతి కూడా ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది:
మంత్రం లేదా స్మరణ: పువ్వులు కోసే సమయంలో భగవంతుని నామాన్ని స్మరించాలి. దీని వల్ల ఆ పువ్వుల పవిత్రత పెరుగుతుంది.
కుడి చేయి మాత్రమే: పూజకు సంబంధించిన పనులకు ఎప్పుడూ కుడి చేతినే వాడాలి.
రాత్రి సమయాల్లో వద్దు: సూర్యాస్తమయం తర్వాత చెట్ల నుంచి పువ్వులు కోయడం అశుభంగా పరిగణించబడుతుంది. రాత్రి పూట చెట్లు నిద్రిస్తాయని, ఆ సమయంలో వాటిని ఇబ్బంది పెట్టకూడదని మన పెద్దలు చెబుతారు.
కింద పడినవి వద్దు: నేల మీద పడిన పూలను లేదా పురుగులు పట్టిన పూలను పొరపాటున కూడా దేవుడికి సమర్పించకూడదు.
"దేవుడు కోరుకునేది బాహ్యమైన ఆడంబరాలను కాదు, పువ్వు లాంటి స్వచ్ఛమైన మనస్సును. అందుకే తాజాగా, సుగంధ భరితంగా ఉండే పూలను భక్తితో సమర్పించాలి," అని పండితులు సూచిస్తున్నారు.
Peddinti Sravya, hyderabad

