దక్షిణ మధ్య రైల్వే 2025-2026 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.21,211.92 కోట్ల అత్యధిక ఆదాయాన్ని సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 3.12 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
ఈ రికార్డు స్థాయి పనితీరు.. సరకు రవాణా, ప్రయాణికుల నిరంతర వృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆదాయ పెరుగుదల దక్షిణ మధ్య రైల్వే ప్రాంతంపై సానుకూల ఆర్థిక ప్రభావాన్ని సూచిస్తుంది.
అధికారిక ప్రకటన ప్రకారం, దక్షిణ మధ్య రైల్వే జోన్ 147.87 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేయడం ద్వారా రూ. 13,835.27 కోట్లు ఆర్జించింది. బలమైన సరకు రవాణా పనితీరుతో దక్షిణ, మధ్య భారతదేశం అంతటా పరిశ్రమలు, వాణిజ్యం, సరఫరా గొలుసులకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. ఇటువంటి వృద్ధి ప్రాంతీయ వాణిజ్యం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా.
ప్రయాణికుల విభాగం నుంచి ఆకట్టుకునే లాభాలు వచ్చాయి. రూ. 6,235.37 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది దక్షిణ మధ్య రేల్వే. ఇది గత సంవత్సరం నమోదైన రూ. 5,714.83 కోట్ల ఆదాయం కంటే 9.11 శాతం పెరుగుదల. 286.44 మిలియన్ల ప్రయాణం చేశారు. ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం 9.11 శాతం పెరిగింది.
దీనికి అదనంగా పార్శిళ్లు, టికెట్ తనిఖీ జరిమానాలు, కోచ్ బుకింగ్లతో సహా ఇతర మార్గాల నుంచి దక్షిణ మధ్య రైల్వే జోన్ రూ.515.18 కోట్లు ఆర్జించింది. పార్కింగ్, క్యాటరింగ్, విశ్రాంతి గదులు, ఇతర వాణిజ్య కార్యకలాపాల వంటి విభాగాల నుంచి మరో రూ.626.10 కోట్లు సమకూరాయి. సరకు రవాణా, ప్రయాణికుల ఆదరణ, ఇతర రాబడులలో స్థిరమైన వృద్ధి సౌత్ సెంట్రల్ రైల్వే నిలకడైన ఆర్థిక పనితీరుకు గణనీయంగా దోహదపడిందని అధికారులు తెలిపారు.
ప్రయాణికులు కూడా ఎక్కువగా రైల్వేలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మెరుగైన కనెక్టివిటీ, వృద్ధి చెందిన సేవలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి. దీనివల్ల పర్యాటకం, వ్యాపార ప్రయాణాలు రెండింటికీ ప్రయోజనం చేకూరింది. గత నాలుగేళ్లుగా ఆదాయంలో నిలకడగా పెరుగుదల కనబరచడం దక్షిణ మధ్య రైల్వే జోన్ కార్యాచరణ సామర్థ్యాన్ని, వ్యూహాత్మక దృష్టిని ప్రదర్శిస్తోందని అధికారులు పేర్కొన్నారు.
పెరిగిన ఆదాయాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునీకరణ ప్రాజెక్టులు, మెరుగైన ప్రయాణికుల సౌకర్యాలకు మద్దతునిస్తాయని, తద్వారా విస్తృత ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘనత సాధించినందుకు జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఉద్యోగులను ప్రశంసించారు.
Anand Sai

