Drishyam 3: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'దృశ్యం 3' చిత్ర ట్రైలర్ శనివారం (మే 9) విడుదలైంది. గత రెండు భాగాల్లో అద్భుతమైన సస్పెన్స్తో మెప్పించిన జార్జ్ కుట్టి (మోహన్లాల్) అండ్ ఫ్యామిలీ, ఈసారి కూడా పోలీసుల కళ్లు గప్పి తమను తాము ఎలా రక్షించుకున్నారనేది ఈ మూడో భాగం కథగా కనిపిస్తోంది.
దృశ్యం 3 ట్రైలర్
ఇండియాలోనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ లో దృశ్యం సినిమాలకు ఓ బ్రాండ్ ఉంది. ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు అదరగొట్టాయి. ఇప్పుడు దృశ్యం 3 అంతకుమించిన రేంజ్ లో మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ గా రెడీ అయిందని ట్రైలర్ తో స్పష్టమవుతోంది. ఇవాళ రిలీజైన ట్రైలర్ అదిరిపోయింది. గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదని, అది సరైన సమయం కోసం వేచి చూస్తుందని జార్జ్ కుట్టి పాత్ర ద్వారా అంచనాలు పెంచేశారు మేకర్స్.
ఈసారి మీడియా ఇన్వెస్టిగేషన్
దృశ్యం ఫస్ట్ రెండు భాగాల్లోనూ పోలీసుల దర్యాప్తు చుట్టూ కథ తిరిగింది. కానీ 'దృశ్యం 3'లో దర్శకుడు జీతూ జోసెఫ్ కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఈసారి ఇద్దరు యువ జర్నలిస్టులు వరుణ్ ప్రభాకర్ కేసుకు సంబంధించిన రహస్యాలను ఛేదించడానికి రంగంలోకి దిగుతారు.
మీడియా ఇన్వెస్టిగేషన్ ద్వారా చుట్టుముట్టే ప్రమాదం నుంచి జార్జ్ కుట్టి కుటుంబం ఎలా తప్పించుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. కుటుంబ రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే జార్జ్ కుట్టి పాత్రలో మోహన్లాల్ మరోసారి పరకాయ ప్రవేశం చేశారు.

