Tata Sierra EV launch : భారత ఆటోమొబైల్ రంగం ఇప్పుడు 'గ్రీన్ ఎనర్జీ' వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు కేవలం చిన్న కార్లకే పరిమితమైన ఎలక్ట్రిక్ టెక్నాలజీ, ఇప్పుడు భారీ ఎస్యూవీల్లోనూ కనిపిస్తోంది.
కేవలం పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలను కూడా కంపెనీలు భారత మార్కెట్లోకి తెస్తున్నాయి. రాబోయే పండుగ సీజన్ నాటికి మన దేశంలో విడుదల కానున్న టాప్-5 మోడల్స్ ఇవే..
లాంచ్కు రెడీ అవుతున్న 5 ఈవీ, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్యూవీలు ఇవే..
- టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (మే 2026)
టయోటా సంస్థ భారత్లో విడుదల చేయనున్న మొట్టమొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ఇదే. ఇది మారుతీ సుజుకీ'ఈ-విటారా' ప్లాట్ఫారమ్పై ఆధారపడి రూపొందింది. ఎబెల్లా రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. ఒకటి 440 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, మరొకటి ఏకంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని డిజైన్ చాలా ఎలిగెంట్గా, మోడ్రన్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
2. టాటా సియెర్రా ఈవీ (జూన్ 2026)
గత ఏడాది నవంబర్లో లాంచ్ అయిన ఐకానిక్ 'సియెర్రా' ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతార్లోనూ రాబోతోంది. టాటా మోటార్స్ దీనిని సింగిల్ మోటార్ (ఆర్డబ్ల్యూడీ), డ్యూయల్ మోటార్ (ఏడబ్ల్యూడీ) వేరియంట్లలో తీసుకురానుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్), వెహికల్-టు-వెహికల్ (వీ2వీ) వంటి బై-డైరెక్షనల్ ఛార్జింగ్ ఫీచర్లు ఉండనున్నాయి.
3. జేఎస్డబ్లప్యూ ఎస్యూవీ (సెప్టెంబర్ 2026)
జేఎస్డబ్ల్యూ మోటార్స్ రంగ ప్రవేశం చేస్తూ విడుదల చేస్తున్న మొదటి కారు ఇది. చైనీస్ మేకర్ 'చెర్రీ'కి చెందిన జెటూర్ ట్రావెలర్ ఆధారంగా దీనిని రూపొందించారు. ఇది ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్యూవీ. ఇందులో 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో పాటు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. కేవలం బ్యాటరీపైనే ఇది 162 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
4. టాటా సఫారి ఈవీ (సెప్టెంబర్ 2026)
టాటా మోటార్స్ తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ సఫారీని కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో తెస్తోంది. హారియర్ ఈవీ లాగే ఇది కూడా 600 కిమీ రేంజ్ను ఇవ్వగలదని అంచనా. ఇందులో 6, 7 సీట్ల ఆప్షన్లు ఉంటాయి. 'సమ్మన్ మోడ్', ఆటో-పార్క్ అసిస్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఈ కారు ప్రత్యేకత. కఠినమైన రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించేలా దీనికి మల్టీ-లింక్ రియర్ సస్పెన్షన్ అమర్చారు.
5. ఎంజీ స్టార్లైట్ 560 (అక్టోబర్ 2026)
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ నుంచి రానున్న ఈ కారు ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ప్యూర్ ఎలక్ట్రిక్.. రెండు వేరియంట్లలోనూ అందుబాటులోకి రానుంది. హైబ్రిడ్ వెర్షన్ 125 కిమీ ప్యూర్ ఈవీ రేంజ్ ఇస్తుండగా, ఎలక్ట్రిక్ వెర్షన్ 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది నేరుగా మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ, టాటా సఫారీ వంటి కార్లతో పోటీ పడనుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (పీహెచ్ఈవీ) అంటే ఏంటి?
ఇందులో పెట్రోల్ ఇంజిన్తో పాటు బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ రెండూ ఉంటాయి. మీరు బ్యాటరీని ప్లగ్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. తక్కువ దూరాలకు కేవలం బ్యాటరీపైనే ప్రయాణించవచ్చు, లాంగ్ జర్నీలప్పుడు పెట్రోల్ వాడుకోవచ్చు.
2. వెహికల్-టు-లోడ్ ఫీచర్ వల్ల ఉపయోమేంటి?
ఈ ఫీచర్ ద్వారా మీ కారు బ్యాటరీని ఒక పవర్ బ్యాంక్ లాగా వాడుకోవచ్చు. అంటే కారు బ్యాటరీ పవర్తో లాప్టాప్, కాఫీ మేకర్ లేదా ఇతర చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను నడపవచ్చు.
Chitturi Eswara Karthikeya Sharath

