Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
K Jamuna Rani: ఇండస్ట్రీలో విషాదం- తెలుగు ప్రముఖ సింగర్ కె జమునారాణి కన్నుమూత- 6 వేలకుపైగా పాటలు, బ్రహ్మచారిణిగా జీవితం!

K Jamuna Rani: ఇండస్ట్రీలో విషాదం- తెలుగు ప్రముఖ సింగర్ కె జమునారాణి కన్నుమూత- 6 వేలకుపైగా పాటలు, బ్రహ్మచారిణిగా జీవితం!

Singer K Jamuna Rani Passed Away: భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక అద్భుతమైన మధుర గాత్రం మూగబోయింది. దక్షిణ భారత భాషల్లో తన సుమధుర స్వరంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీతాభిమానులను మైమరపించిన ప్రముఖ సీనియర్ సింగర్ కె.

జమునారాణి (కోకా జమునా రాణి) కన్నుమూశారు.

వివిధ భాషల ప్రముఖుల దిగ్భ్రాంతి

గురువారం (జూలై 30) బెంగళూరులోని తన నివాసంలో జమునారాణి (88) తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ చిత్రసీమలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జమునారాణి

1938 మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జమునారాణికి చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెరిగింది. తండ్రి వరదరాజులు నాయుడు ప్రైవేట్ ఉద్యోగి కాగా, తల్లి ద్రౌపది వయోలిన్ విద్వాంసురాలు. ఇంట్లోనే శాస్త్రీయ సంగీత వాతావరణం నెలకొనడంతో ఆమె చాలా చిన్న వయసులోనే గాత్ర సాధన మొదలుపెట్టారు.

ఏడేళ్ల ప్రాయంలోనే తొలి పాట

కేవలం ఏడేళ్ల వయసులో ప్రతిష్టాత్మక 'త్యాగయ్య' (1946) సినిమాలో బాలనటుల కోసం తొలిసారి పాట పాడి సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు, దర్శకుడు చిత్తూరు వి. నాగయ్య నిర్మించారు. ఆ తర్వాత కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే హీరోయిన్లకు ప్లేబ్యాక్ సింగర్‌గా పాడే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.

ఐదు భాషలు.. 6,000 పైగా పాటలు

1952లో మాడ్రన్ థియేటర్స్ నిర్మించిన 'వలయపతి' చిత్రంతో హీరోయిన్‌కు పూర్తిస్థాయి నేపథ్య గాయనిగా మారిన జమునారాణి, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళం భాషల్లో కలిపి ఏకంగా 6,000 కంటే ఎక్కువ పాటలు ఆలపించి రికార్డు సృష్టించారు.

జమునారాణి తెలుగు సినిమాలు

తెలుగులో 'ద్రోహి', 'భాగ్యదేవత', 'శభాష్ రాముడు', 'సౌభాగ్యవతి' వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలకు జమునారాణి అందించిన పాటలు ఇప్పటికీ శ్రోతల హృదయాల్లో నిలిచిపోయాయి. అప్పటి తరం దిగ్గజ సంగీత దర్శకులందరి వద్ద పనిచేసిన ఆమె, ప్రతి పాటకూ తనదైన ప్రత్యేక శైలిని అద్ది రక్తికట్టించేవారు. "జమునారాణి గారి గాత్రంలో ఉన్న తీపి, భావ వ్యక్తీకరణ రాబోయే తరాలకు మార్గదర్శకం" అని సంగీత విశ్లేషకులు కొనియాడారు.

పురస్కారాలు - జీవితాంతం సంగీతానికే అంకితం

సంగీత రంగానికి ఆమె చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం 1998లో జమునారాణిని అత్యున్నత 'కళైమామణి' పురస్కారంతో సత్కరించింది. ఆ తర్వాత 2002లో 'అరిజ్ఞర్ అన్నాదురై' పురస్కారాన్ని కూడా ప్రదానం చేసింది. జీవితాంతం గానకళకే అంకితమైన జమునారాణి వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిణిగానే శేష జీవితాన్ని గడపడం విశేషం.

ఇవాళ అంత్యక్రియలు

బెంగళూరులోని కల్లహళ్లి శ్మశానవాటికలో నేడు శుక్రవారం (జూలై 31) జమునారాణి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసిన జమునారాణి భౌతికంగా దూరమైనా, తన మధుర గీతాల రూపంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu