అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల సామాన్యుడిపై కోలుకోలేని దెబ్బ పడుతోంది! ఈ నేపథ్యంలోనే తాజాగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
ఫలితంగా ఇప్పుడు ఒక్కో వాణిజ్య సిలిండర్పై రూ. 993 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంచిన ధరలు నేటి నుంచే (మే 1, 2026) అమల్లోకి వచ్చాయి.
కాగా ఇళ్లల్లో వాడుకునే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరించకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయం.
తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 3071.5కి చేరింది. ఇక ముంబైలో ఇది రూ. 2,031 నుంచి రూ. 3,024కి పెరిగింది. బెంగళూరులో రూ. 3,152గాను, చెన్నైలో రూ. 3237గాను ఉంది. కోల్కతాలో సిలిండర్ ధర 3,300గా కొనసాగుతోంది.
తాజా పెంపుతో హైదరాబాద్లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 3,300 దాటేసింది. ఇక హైదరాబాద్లో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 965గా ఉంది.
ఇక విజయవాడలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 3,251.50గాను, 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 937.5గాను ఉంది.
ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాలా? వద్దా? అనే విషయంపై ప్రతి నెల 1వ తేదీన చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకుంటాయి. దేశంలో చాలా నెలల పాటు సిలిండర్ల ధరలు స్థిరంగా కొనసాగాయి. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గత కొన్ని నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధర పెరుగుతూ వస్తోంది. ఫలితంగా రెస్టారెంట్లు తమ మెన్యూ రేట్లను పెంచుతున్నాయి. ఇది సామాన్యుడిని పరోక్షంగా ప్రభావితం చేస్తోంది. ఇదే కొనసాగితే ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే దేశ జీడీపీ కూడా ఎఫెక్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇరాన్ యుద్ధంతో అల్లకల్లోలం!
దేశం తన ఎల్పీజీ అవసరాల్లో 60శాతం వరకు దిగుమతి చేసుకుంటుంది. కానీ చమురు సరఫరాకు జీవనాధారమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ వద్ద అనిశ్చితి కారణంగా సప్లై చెయిన్ దెబ్బతింది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఎల్పీజీ కనెక్షన్లను ఇవ్వడం కూడా ఆపేసిందని తెలుస్తోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు..
ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపు వార్తలు ప్రజలకు అలవాటైపోయాయి. ఇప్పుడందరు పెట్రోల్, డీజల్ ధరల పెంపుపై ఫోకస్ చేస్తున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇంధన ధరలు పెరుగాయని అందరు ఊహించారు. కానీ పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచకపోవడం ఊరటనిచ్చే విషయం.
విమానాల్లో వాడే ఇంధనం ( ఏటీఎఫ్) ధరలను కూడా ఈసారి పెంచలేదు. ఇది విమానయాన రంగానికి పెద్ద ఊరటనిచ్చే అంశం.
Chitturi Eswara Karthikeya Sharath

