Dailyhunt
Nikhil: మమతకు సరైన బుద్ధి చెప్పారు.. బెంగాల్ ప్రజలు అది మరచిపోలేదు: నిఖిల్ సిద్ధార్థ ట్వీట్ వైరల్

Nikhil: మమతకు సరైన బుద్ధి చెప్పారు.. బెంగాల్ ప్రజలు అది మరచిపోలేదు: నిఖిల్ సిద్ధార్థ ట్వీట్ వైరల్

Nikhil: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన హృదయవిదారక ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఆసుపత్రిలో జరిగిన అమానుషంపై యావత్ భారత్ నిరసనలతో అట్టుడికిపోయింది.

తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నిఖిల్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. అక్కడి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

బెంగాల్ ప్రజలు మర్చిపోలేదు

ఆర్జీ కర్ వైద్య కళాశాలలో జరిగిన దారుణాన్ని పశ్చిమ బెంగాల్ ప్రజలు మర్చిపోలేదని, అలాగే దోషులను వెనకేసుకొచ్చిన వారిని క్షమించలేదని నిఖిల్ అభిప్రాయపడ్డారు.

"పశ్చిమ బెంగాల్ ప్రజలు ఆ ఘటనను మర్చిపోలేదు.. మన్నించలేదు కూడా. సామాన్య ప్రజల పట్ల శ్రద్ధ చూపని ప్రభుత్వానికి వారు సరైన రీతిలో బుద్ధి చెప్పారు" అంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిఖిల్ ట్వీట్ చేశారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే ప్రజలే నిర్ణయాత్మక శక్తిగా మారాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

న్యాయం కోసం గళం

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో నిఖిల్ ఈ ట్వీట్ చేశారు. "జస్టిస్ ఫర్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హారర్" అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఆయన జోడించారు. ఒక నటుడిగా కాకుండా బాధ్యతాయుతమైన పౌరుడిగా నిఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి. సామాన్యుల భద్రతను గాలికొదిలేసిన పాలకులకు ఓటు రూపంలో ప్రజలు గుణపాఠం నేర్పారని ఆయన విశ్లేషించారు.

ఈ ఘటన జరిగిన సమయంలో తాను చేసిన ఓ వీడియోను దీనికి జత చేశారు. 2024లో ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని చేసిన ఆ వీడియోలో ఆర్జీ కర్ ఘటనపై నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై నిఖిల్ ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. ఇప్పుడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజలు తమ తీర్పు ద్వారా బాధితురాలికి సంఘీభావం తెలిపారని ఆయన భావిస్తున్నారు. నిఖిల్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా మూడుసార్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ నేతృత్వంలోనే తృణమూల్ కాంగ్రెస్.. ఈసారి కేవలం 79 సీట్లకే పరిమితమైంది. మమత కూడా తాను పోటీ చేసిన భవానీపూర్ లో ఓటమి పాలయ్యారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: నిఖిల్ సిద్ధార్థ్ తన ట్వీట్‌లో ఏ ఘటన గురించి ప్రస్తావించారు?

జవాబు: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన అమానుష ఘటన, దానికి బాధ్యులైన వారికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు గురించి నిఖిల్ ప్రస్తావించారు.

ప్రశ్న: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై నిఖిల్ చేసిన విమర్శ ఏమిటి?

జవాబు: సామాన్య ప్రజల పట్ల శ్రద్ధ చూపని ప్రభుత్వానికి అక్కడి ప్రజలు బుద్ధి చెప్పారని, ఆ దారుణాన్ని వారు మర్చిపోలేదని నిఖిల్ విమర్శించారు.

బెంగాల్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది?

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 208 స్థానాల్లో గెలిచింది. తృణమూల్ కేవలం 79 స్థానాలకే పరిమితమైంది.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu