"తప్పులు చేసే స్వేచ్ఛ లేనప్పుడు, ఆ స్వాతంత్య్రానికి ఎటువంటి విలువ లేదు" అని జాతిపిత మహాత్మా గాంధీ పేర్కొన్నారు. స్వేచ్ఛ అంటే కేవలం హక్కులు అనుభవించడం లేదా నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు.
పొరపాట్లు చేసేందుకు, వాటి నుంచి కొత్త విషయాలు నేర్చుకునేందుకు లభించే అవకాశమే నిజమైన స్వాతంత్య్రం అని ఆయన బలంగా నమ్మారు. ఓటమి ఎదురైనప్పుడే మనిషికి అనుభవం, వివేకం, ఆత్మవిశ్వాసం సొంతమవుతాయి. ఈ లోకంలో ఎవ్వరూ పరిపూర్ణులు కారని, తప్పులు అనేవి ఎదుగుదలలో ఒక భాగమని గాంధీజీ మాటలు మనకు గుర్తుచేస్తాయి. సమాజం భయంతో కాకుండా బాధ్యతతో, నేర్చుకునే తత్వంతో ముందుకు సాగాలనే తత్వాన్ని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది.
గాంధీజీ దృష్టిలో స్వేచ్ఛ అసలు అర్థం
ప్రతి వ్యక్తి తన సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలి. ఆ నిర్ణయాలు ఒక్కోసారి విఫలమైనప్పటికీ, ఆ అనుభవమే మనిషి వ్యక్తిత్వాన్ని మలుస్తుంది. తప్పులు చేస్తామనే భయంతో అసలు ప్రయత్నమే చేయకపోతే కొత్త ఆవిష్కరణలు జరగవు, సమాజం ముందుకు సాగదు. మితిమీరిన నియంత్రణలు, ఆంక్షలు ఉన్న చోట ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే వైఫల్యాలను అంగీకరించి, వాటిని సరిదిద్దుకుంటూ మెరుగైన ప్రయాణం సాగించడమే నిజమైన స్వాతంత్య్రం అని గాంధీజీ అభిప్రాయపడ్డారు.
నేటి ఆధునిక కాలానికి ఈ సూక్తి ఎందుకు అవసరం?
ప్రస్తుత కాలంలో విఫలమవుతామనే భయం మనుషులను ఎక్కువగా వెంటాడుతోంది. మార్కులు తక్కువ వస్తాయని విద్యార్థులు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటామేమో అని ఉద్యోగులు, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని సామాన్యులు కొత్త పనులు చేయడానికి వెనుకాడుతున్నారు. ఈ తరుణంలో గాంధీజీ మాటలు అందరికీ కొండంత ఆండగా నిలుస్తాయి. చరిత్రలో జరిగిన ప్రతి గొప్ప ఆవిష్కరణ, సాధించిన ప్రతి ఘనత ఎన్నో వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాల పునాదిపైనే నిర్మితమయ్యాయి. తప్పులను బలహీనతగా కాకుండా, విజయానికి మార్గాలుగా భావించాల్సిన అవసరం ఉంది.
జీవితంలో ఈ సిద్ధాంతాన్ని ఎలా ఆచరించాలి?
గాంధీజీ చెప్పిన ఈ ఉన్నతమైన భావాలను నిత్య జీవితంలో అలవర్చుకోవడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలు..
- పొరపాట్లు జరిగినప్పుడు సిగ్గుపడకుండా, వాటిని నేర్చుకునే అవకాశాలుగా స్వీకరించాలి.
- వైఫల్యం ఎదురైనప్పుడు ఎక్కడ లోపం జరిగిందో ప్రశాంతంగా విశ్లేషించుకుని, తదుపరి ప్రయత్నాన్ని మెరుగుపరుచుకోవాలి.
- ఇతరులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను భయం లేకుండా పంచుకునేలా ప్రోత్సహించాలి.
- ప్రతి పనిలోనూ మొదటిసారే పరిపూర్ణత ఆశించకుండా, నిరంతర సాధనపై దృష్టి పెట్టాలి.
- విద్య, ఉద్యోగం, వ్యక్తిగత బంధాలలో ఓటమిని ఒక గుణపాఠంగా చూసినప్పుడే ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరుగుతాయి.
మహాత్ముడి జీవన ప్రస్థానం
మోహన్దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న పోర్బందర్లో జన్మించారు. తండ్రి కరంచంద్ గాంధీ పోర్బందర్ దివాన్గా పని చేయగా, తల్లి పుత్లీబాయి గాంధీ ధార్మిక చింతన ఆయన నైతిక విలువలపై గాఢమైన ముద్ర వేసింది. రాజ్కోట్లో ప్రారంభ విద్యాభ్యాసం పూర్తి చేసిన గాంధీజీ, లండన్లోని ఇన్నర్ టెంపుల్లో న్యాయశాస్త్రం అభ్యసించి బారిస్టర్గా అర్హత సాధించారు.
1883లో కస్తూరిబాతో ఆయన వివాహం జరిగింది. వారికి హరిలాల్, మణిలాల్, రామదాస్, దేవదాస్ అనే నలుగురు కుమారులు ఉన్నారు. సత్యం, అహింస, శాసనోల్లంఘన వంటి ఆయుధాలతో భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుండి నడిపించిన మహాత్ముడు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హక్కుల ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచారు.
HT Telugu Desk

