Dailyhunt
Santosh Nair: మలయాళ ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు కన్నుమూత.. అతని మూవీ ఓటీటీ రిలీజ్‌కు ముందే..

Santosh Nair: మలయాళ ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు కన్నుమూత.. అతని మూవీ ఓటీటీ రిలీజ్‌కు ముందే..

Santosh Nair: మలయాళ చిత్ర పరిశ్రమలో తీరని విషాదం నెలకొంది. సీనియర్ నటుడు సంతోష్ నాయర్ (సంతోష్ కేశవన్ నాయర్) మంగళవారం (మే 5) ఉదయం కేరళలో జరిగిన దారుణమైన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

పతనంతిట్ట జిల్లా ఏనత్తు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య సుభాశ్రీ తీవ్రంగా గాయపడ్డారు.

సంతోష్ నాయర్ ప్రమాదం ఇలా..

పోలీసులు, పీటీఐ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం సుమారు 6:30 గంటల ప్రాంతంలో సంతోష్ నాయర్ దంపతులు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారు నడుపుతున్న సంతోష్ నాయర్ ఛాతీ స్టీరింగ్ వీల్‌కు బలంగా తగలడంతో ఆయన అంతర్గత అవయవాలు దెబ్బతిని తీవ్ర రక్తస్రావమైంది. ఆయన భార్య సుభాశ్రీ పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలపాలయ్యారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంతోష్ నాయర్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భార్య సుభాశ్రీకి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ దంపతులకు రాజశ్రీ ఎస్. నాయర్ అనే కుమార్తె ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె కారులో ఉందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

సంతోష్ నాయర్ నేపథ్యం

తిరువనంతపురంలో జన్మించిన సంతోష్ నాయర్ విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి సి.ఎన్. కేశవన్ నాయర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కాగా, తల్లి రిటైర్డ్ టీచర్. ఉద్యోగ రీత్యా తల్లిదండ్రులు ఇథియోపియా వెళ్లడంతో సంతోష్ తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆయన పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం

సంతోష్ నాయర్ 1982లో వచ్చిన 'ఇతు నంగళుడె కథ' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. సుమారు 40 ఏళ్ల తన సినీ కెరీర్‌లో 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు పోషించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.

మలయాళ స్టార్ హీరోలు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి వారితో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వసంత సేన, నిషేధి, కృష్ణ గోపాలకృష్ణ, రన్‌వే, ది టైగర్, ఖాకీ, నాట్టురాజావు వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.

చివరి చిత్రం ఓటీటీలోకి వస్తుండగా..

సంతోష్ నాయర్ నటించిన చివరి సినిమా 'మోహినియాట్టం' (భరతనాట్యం 2) ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. సాయిజు కురుప్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. 2024లో వచ్చిన 'భరతనాట్యం' చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందింది.

ఈ సినిమా మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. తన చివరి సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు ముందే సంతోష్ ఇలా కన్నుమూయడం అభిమానులను కలచివేస్తోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: సంతోష్ నాయర్ ప్రమాదం ఎక్కడ జరిగింది?

జవాబు: కేరళలోని పతనంతిట్ట జిల్లా ఏనత్తు సమీపంలో మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

ప్రశ్న: సంతోష్ నాయర్ భార్య పరిస్థితి ఎలా ఉంది?

జవాబు: సంతోష్ భార్య సుభాశ్రీ పక్కటెముకలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రశ్న: సంతోష్ నాయర్ నటించిన చివరి సినిమా ఏది?

జవాబు: ఆయన నటించిన చివరి చిత్రం 'మోహినియాట్టం' (భరతనాట్యం 2). ఇది మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu