Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సౌదీలో ప్రమాదానికి గురైన తెలంగాణ నర్స్ ఆవేదన.. స్వదేశానికి రప్పించాలని తల్లి కన్నీటి విజ్ఞప్తి

సౌదీలో ప్రమాదానికి గురైన తెలంగాణ నర్స్ ఆవేదన.. స్వదేశానికి రప్పించాలని తల్లి కన్నీటి విజ్ఞప్తి

సౌదీ అరేబియాలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన తెలంగాణ నర్సు గూగులోత్ సునీత(36)ను స్వదేశానికి రప్పించాలని ఆమె కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని వేడుకున్నారు.

బ్యాంకు రుణం బకాయి ఉందన్న కారణంతో సౌదీ అధికారులు ఆమెపై ట్రావెల్ బ్యాన్ విధించడంతో ఆమె అక్కడ చిక్కుకుపోయారు.

ఈ విషాద సంఘటనపై సునీత తల్లి గూగులోత్ పారంగి జూలై 31న సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించి, తన కుమార్తెను కాపాడాలని వేడుకుంటూ వినతిపత్రం సమర్పించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన సునీత బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అనంతరం, కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు 2024 సెప్టెంబర్ 7న సౌదీ అరేబియా వెళ్లారు.

అక్కడ కింగ్ అబ్దుల్లా హాస్పిటల్‌లో ఐసీయూ స్పెషలిస్ట్ నర్సుగా బాధ్యతలు చేపట్టి ఎంతో మంది రోగులకు సేవలు అందించారు. అయితే 2025 ఏప్రిల్ 23న జరిగిన తీవ్రమైన రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఈ ప్రమాదంలో సునీత రెండు చేతులు, వెన్నుముక, తలకు తీవ్ర గాయాలయ్యాయి. పలు శస్త్రచికిత్సలు చేసి ఆమె శరీరంలో మెటల్ ప్లేట్లను అమర్చారు. సౌదీ మెడికల్ బోర్డు ఆమెకు 87 శాతం శాశ్వత వైకల్యం సంభవించిందని ధృవీకరిస్తూ, ఉద్యోగానికి అనర్హురాలిగా ప్రకటించింది. దీంతో ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయారు.

2025 నవంబర్ నుంచి వేతనం అందకపోవడంతో, వైద్య ఖర్చులు, కనీస జీవన వ్యయాలు కూడా భరించలేక కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రోడ్డు ప్రమాదానికి ముందు సునీత తన కుటుంబ అవసరాల కోసం సౌదీలోని ఒక బ్యాంకు నుండి 1,48,000 సౌదీ రియాళ్లు (సుమారు రూ. 38 లక్షలు) రుణం తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వైద్య పత్రాలను బ్యాంకుకు సమర్పించినప్పటికీ, రుణ వివాదం పరిష్కారం కాలేదు.

ఈ బకాయి కారణంతో సౌదీ అధికారులు ఆమెపై ట్రావెల్ బ్యాన్ విధించారు. మెరుగైన వైద్య చికిత్స అవసరమున్నప్పటికీ, ఈ నిషేధం వల్ల ఆమె సౌదీ వదిలి రావడానికి వీలు లేకుండా పోయింది. సునీత తన కుటుంబానికి వెన్నెముకగా నిలిచారు. తల్లి గుండె శస్త్రచికిత్స, తండ్రి మెదడు శస్త్రచికిత్స ఖర్చులను తనే భరించారు. ముగ్గురు చెల్లెళ్ల చదువు, వివాహాలు, ప్రసవ ఖర్చులను చూసుకున్నారు.

2011లో సోదరుడు మరణించడంతో, ఆయన ఇద్దరు చిన్న పిల్లల పెంపకం బాధ్యతను కూడా స్వీకరించారు. ఇప్పుడు ఆమె మంచానికే పరిమితం కావడంతో ఆ నిరుపేద కుటుంబం మానసికంగా, ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోయింది. 'నా కూతురు ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. ఈ రోజు నా కూతురిని కాపాడి ఇంటికి రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.' అని తల్లి పారంగి కన్నీరుమున్నీరయ్యారు.

తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీమ్‌రెడ్డి ఈ పిటిషన్‌ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లు ఆగస్టు 4 తెలిపారు. సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి ఈ వినతిని పరిశీలించి, సునీతను త్వరితగతిన స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రికి సిఫార్సు చేశారు.

Anand Sai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu