అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో సహాయపడగల శిక్షణ పొందిన స్వచ్ఛంద కార్యకర్తల బృందాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన, అత్యవసర, పౌర రక్షణ శాఖ రెండు విశ్వవిద్యాలయాలలో పౌర రక్షణ స్వచ్ఛంద కార్యకర్తల శిక్షణా కార్యక్రమాలను(Civil Defence Volunteer Training Programmes) ప్రారంభించింది.
ఈ స్వచ్ఛంద కార్యకర్తలు సహాయక చర్యలు, అగ్నిమాపకం, ప్రథమ చికిత్స, జన సమూహ నిర్వహణ, విపత్తు సన్నద్ధత, సామాజిక అవగాహన, సహాయ పంపిణీ వంటి అంశాలలో సైద్ధాంతిక, ఆచరణాత్మక శిక్షణ పొందుతారు. అత్యవసర పరిస్థితులలో వీరు అగ్నిమాపక శాఖ, పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, ఇతర శాఖలతో కలిసి పనిచేస్తారు.
దులాపల్లిలోని మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో 400 మంది స్వచ్ఛంద కార్యకర్తలకు విపత్తు ప్రతిస్పందన, అత్యవసర నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలలో శిక్షణ ఇస్తారు. అగ్నిమాపక శాఖ అధికారుల సమక్షంలో వైస్-ఛాన్సలర్ పి. రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అదే సమయంలో కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం రెండో బ్యాచ్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి 200 మంది పౌర రక్షణ వాలంటీర్లు, విశ్వవిద్యాలయ యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బందికి చెందిన 50 మంది సభ్యులు హాజరయ్యారు.
అగ్నిమాపక, విపత్తు ప్రతిస్పందన, అత్యవసర, పౌర రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. ఈ చొరవ రాష్ట్రవ్యాప్తంగా విపత్తు సంసిద్ధతను, అత్యవసర ప్రతిస్పందనను బలోపేతం చేస్తుందని అన్నారు. వరదలు, పెద్ద అగ్నిప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో అత్యవసర సేవలు వచ్చేలోపు, శిక్షణ పొందిన వాలంటీర్లు సంబంధిత శాఖలకు సహాయం చేయగలరని అన్నారు.
అత్యవసర పరిస్థితులలో శిక్షణ పొందిన సివిల్ డిఫెన్స్ వాలంటీర్లను మోహరించడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించడానికి ఆస్కారం ఉందన్నారు. వారికి సంబంధించి.. అప్డేట్ చేసిన డేటాబేస్లను నిర్వహించాలని డైరెక్టర్ జనరల్ జిల్లా అధికారులను ఆదేశించారు.
Anand Sai

