Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
T-Fiber Internet : సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్

T-Fiber Internet : సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్నెట్ సేవలను కేవలం టీ-ఫైబర్ ద్వారానే అందించేలా చూడాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.

టీ-ఫైబర్ సేవల విస్తరణకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్దేశిత కాలపరిమితిలోగా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి టీ-ఫైబర్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

అంతేకాకుండా సెప్టెంబర్ 1 తర్వాత ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోకూడదని, వాటికి బిల్లులు చెల్లించకూడదని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ప్రభుత్వ నిధులను ఆదా చేయడం, ఏకీకృత డిజిటల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వ శాఖలు ఉపయోగిస్తున్న టి-స్వాన్ నెట్‌వర్క్‌ను వచ్చే నెలలోగా పూర్తిగా టి-ఫైబర్‌కు మార్చాలని శ్రీధర్ బాబు అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. ఈ ప్రక్రియ ఎలాంటి జాప్యం లేకుండా సాగేలా చూడాలని వారిని ఆదేశించారు. అంతేకాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రాబోయే 'ఫ్యూచర్ సిటీ'కి అత్యాధునిక టి-ఫైబర్ కనెక్టివిటీని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందేలా చూడటానికి, ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'ప్రతి ఇంటికీ ఇంటర్నెట్' పథకాన్ని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. అధికారులందరి సమన్వయ కృషి అవసరాన్ని నొక్కి చెబుతూ, గడువులోగా తమ లక్ష్యాలను చేరుకుని, తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఉన్న రాష్ట్రంగా మార్చాలని ఆయన అధికారులను కోరారు.

సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన T-Fiber సమీక్షా సమావేశంలో ప్రధాన కార్యదర్శి సీఎస్ సంజయ్ జాజు పాల్గొన్నారు. 'సెప్టెంబర్ 1 నుండి తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టి-ఫైబర్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే రోడ్‌మ్యాప్, టి-స్వాన్ నుండి టి-ఫైబర్‌కు మార్పు, ఫ్యూచర్‌సిటీ కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, నిరంతరాయ డిజిటల్ గవర్నెన్స్, పౌర సేవలను మెరుగుపరచడానికి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించాం.' అని సీఎస్ కార్యాలయం ప్రకటించింది.

Anand Sai, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu