ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి విడత కింద ఎంపికైన వారు… ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు.
చాలాచోట్ల గృహా ప్రవేశాలు జరుగుతున్నాయి. అయితే రెండో విడత కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇదే విషయంపై రాష్ట్ర గృహా నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
సోమవారం కూసుమంచిలో నిర్వహించిన 'ప్రజా దర్బార్' కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి పొంగులేటి…. ప్రజా దర్బార్లలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే దరఖాస్తులు వస్తున్నాయన్నారుయ గత ప్రభుత్వ వైఫల్యం వల్లే పేదలకు ఇళ్ల సమస్య తీవ్రమైందని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేదని భరోసా కల్పించారు.
ఈ నెలాఖారు నుంచి రెండో విడత
ఇప్పటికే మొదటి విడత ఇళ్ల నిర్మాణం సింహభాగం పూర్తయిన నేపథ్యంలో…. మే నెలాఖరు నుండి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతి సోమవారం నేరుగా నిధులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు.
అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి సేవలు అందించడమే 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' ముఖ్య ఉద్దేశమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం…. ఎన్నికల వేళ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని గుర్తుచేశారు. గతంలో మద్దతు ధర అడిగిన రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాజును చేస్తోందని కొనియాడారు.
మే 5, 6, 7 తేదీలలో వరంగల్లో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి 'రైతు వారోత్సవాలు' ప్రారంభమవుతాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పాలేరు నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని క్లస్టర్లుగా విభజించి ఈ ప్రజా దర్బార్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకెళ్తున్నామని…. ప్రతి న్యాయబద్ధమైన దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ దివాకర టి.ఎస్ హామీ ఇచ్చారు.
Maheshwaram Mahendra Chary

