Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tummidihatti Barrage : 'తుమ్మిడిహెట్టి' బ్యారేజీ వివాదంపై కదలిక - సెప్టెంబర్ 1న ఢిల్లీలో కీలక భేటీ..!

Tummidihatti Barrage : 'తుమ్మిడిహెట్టి' బ్యారేజీ వివాదంపై కదలిక - సెప్టెంబర్ 1న ఢిల్లీలో కీలక భేటీ..!

Tummidihatti Barrage : ఉమ్మడి ఆదిలాబాద్‌ సహా తెలంగాణలోని కరువు ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంలో చాలా కాలంగా నలుగుతున్న అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన ఈ బ్యారేజ్‌కు సంబంధించి సాంకేతిక సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలపై చర్చించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సెప్టెంబర్ 1న ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

సెప్టెంబర్ 1న కీలక భేటీ…

ఢిల్లీలోని సేవా భవన్‌లో సెప్టెంబర్ 1 ఉదయం 11 గంటలకు సీడబ్ల్యూసీ ఛైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన సీనియర్ అధికారులు హాజరుకానున్నారు.

సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం జరిపిన సంప్రదింపుల ఫలితంగానే కేంద్రం ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వెల్లడించింది.

పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లగా, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఈ వ్యవహారాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది. అనంతరం, అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి మరో ప్రత్యేక లేఖ రాశారు.

ఎత్తుపైనే పీటముడి…!

  • తెలంగాణ ప్రతిపాదన : తుమ్మిడిహట్టి బ్యారేజ్‌ను 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.
  • మహారాష్ట్ర వైఖరి : మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో 148 మీటర్ల ఎత్తుకు మాత్రమే అంగీకారం తెలిపింది.

బ్యారేజ్ ఎత్తును 148 మీటర్లకే పరిమితం చేస్తే, గ్రావిటీ (గురుత్వాకర్షణ) ద్వారా అవసరమైన నీటిని తరలించడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారీ పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తే విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగి రాష్ట్ర ఖజానాపై విపరీతమైన ఆర్థిక భార పడుతుందని వివరించింది. పరిశోధనల మద్దతుతో తెలంగాణ వాదనఎత్తు పెంచడం వల్ల ముంపు ప్రాంతం పెరుగుతుందన్న మహారాష్ట్ర అభ్యంతరాల పైనా తెలంగాణ వద్ద స్పష్టమైన పరిష్కారం ఉంది.

నీటి మట్టాన్ని 152 మీటర్లకు పెంచడం ద్వారా ఏర్పడే అదనపు ముంపు ప్రభావాన్ని తగ్గించవచ్చని కేంద్ర జల మరియు విద్యుత్ పరిశోధనా సంస్థ (సిడబ్ల్యూపిఆర్‌ఎస్) నిర్వహించిన అధ్యయనాలు స్పష్టం చేసినట్లు సీఎంఓ పేర్కొంది.సెప్టెంబర్ 1న జరిగే ఈ భేటీ ద్వారా ఇరు రాష్ట్రాలు ఒకే వేదికపైకి వచ్చి సాంకేతిక సమస్యలకు పరిష్కారం కనుగొంటాయని… ఫలితంగా తెలంగాణలోని వెనుకబడిన, కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu