Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TV: వ్యవసాయం చేసి అన్నీ పోగొట్టుకున్నా, రికవరీ ఏజెంట్లు బూతులు తిట్టారు.. ప్రముఖ టీవీ నటుడు రాజేష్ కుమార్ కన్నీటి గాథ

TV: వ్యవసాయం చేసి అన్నీ పోగొట్టుకున్నా, రికవరీ ఏజెంట్లు బూతులు తిట్టారు.. ప్రముఖ టీవీ నటుడు రాజేష్ కుమార్ కన్నీటి గాథ

TV Actor Rajesh Kumar Agriculture Loss: భారతీయ బుల్లితెర చరిత్రలో తిరుగులేని ఆదరణ పొందిన 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' సీరియల్‌లో 'రోసేష్ సారాభాయ్' పాత్రతో దేశమంతటా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజేష్ కుమార్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను అనుభవించారు.

కార్లు అమ్ముకునే పరిస్థితి

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నటనకు స్వస్తి చెప్పి వ్యవసాయంలోకి అడుగుపెట్టిన ఆయన, ఆ నిర్ణయం వల్ల సర్వస్వం కోల్పోయినట్లు స్వయంగా వెల్లడించారు రాజేష్ కుమార్. డిపాజిట్లు ఖాళీ అయి, చివరకు కార్లు కూడా అమ్మేసుకునే పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు.

కెరీర్ పీక్‌లో తప్పుడు నిర్ణయం.. ఆస్తులన్నీ మాయం!

42 ఏళ్ల వయసులో నటనకు విరామం ఇచ్చి సేంద్రీయ వ్యవసాయం వైపు వెళ్లిన నిర్ణయం తన ఆర్థిక మూలాలను దెబ్బతీసిందని రాజేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

దేవుడి ప్లాన్

"ఇదంతా దేవుడి ప్లాన్ అని భావిస్తున్నా. కెరీర్ అద్భుతంగా సాగుతున్న సమయంలో నటనకు విరామం ఇచ్చి వ్యవసాయం మొదలుపెట్టాను. కానీ, అందులో దారుణంగా నష్టపోయి నా దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నాను. 2022లో మళ్లీ నటనలోకి అడుగుపెట్టాను. ఆ ఐదేళ్లు నన్ను ఒక మనిషిగా పూర్తిగా మార్చేశాయి" అని రాజేష్ కుమార్ పేర్కొన్నారు.

రికవరీ ఏజెంట్ల బూతులు..

జీరోకి పడిపోయిన సమయంలో మనిషికి ఎంత అవమానం జరుగుతుందో, ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో తనకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చిందని ఆయన వివరించారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో అప్పులు తీర్చలేక ఎదుర్కొన్న అవమానాలను రాజేష్ కుమార్ గుర్తుచేసుకున్నారు.

పర్సనల్ కార్లను విక్రయించడమే కాకుండా రికవరీ ఏజెంట్ల నుంచి తీవ్రమైన నిందలు భరించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. "క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టలేకపోవడంతో రికవరీ ఏజెంట్లు కింద వాచ్‌మెన్ కేబిన్‌కు ఫోన్ చేసి నన్ను దారుణంగా తిట్టేవారు. చివరికి నా కారును కూడా అమ్మేశాను. నా వద్ద ఉన్న చివరి ఈకో కారును నాసిక్‌లో పనిచేసే రైతులకు ఇచ్చేశాను. ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ నేను డిప్రెషన్‌లోకి వెళ్లలేదు" అని నటుడు రాజేష్ కుమార్ వెల్లడించారు.

తిరుగులేని రీఎంట్రీ!

గత నాలుగు ఐదేళ్లు తనకు జీవితంలో ఎంతో విలువైన పాఠాలు నేర్పాయని, ఆ అనుభవాలే తనను మరింత బలంగా మార్చాయని ఆయన ధైర్యంగా చెప్పారు.

కష్టాల నుంచి కోలుకున్న తర్వాత రాజేష్ కుమార్ 2022లో తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కేవలం ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా వైవిధ్యమైన ఓటీటీ ప్రాజెక్టులు ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు.

'రానా నాయుడు'తో సెకండ్ ఇన్నింగ్స్..

'యే మేరీ ఫ్యామిలీ' వెబ్ సిరీస్‌తో మంచి ప్రశంసలు అందుకున్న ఆయన, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ 'రానా నాయుడు', అలాగే 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్' లలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.

హిందీ చిత్రాల్లో కీలక పాత్రలు

ఇవే కాకుండా 'సైయారా', 'హై జవానీ తో ఇష్క్ హోనా హై', 'నిశాంచీ' వంటి పలు హిందీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ మళ్లీ నటుడిగా తన ప్రతిభను చాటుకుంటున్నారు.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu