రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు సామాన్యులు విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా ఉపాధి కోసం ఎండలో తిరిగే కూలీలు, బాటసారులు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మనం చూస్తున్నాం.
ఇలాంటి కష్టకాలంలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 4 లక్షల భారీ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
ఈ పరిహారం ఎవరికి వస్తుంది? ఎలా దరఖాస్తు చేసుకోవాలో సామాన్యులకు అర్థమయ్యేలా పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
వడదెబ్బతో మరణిస్తే రూ. 4 లక్షల పరిహారం
వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) ద్వారా ప్రభుత్వం ఈ ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఈ 4 లక్షల పరిహారం అందాలంటే కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. వ్యక్తి మరణించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష చేయించాలి. రిపోర్టులో 'వడదెబ్బ వల్లే మరణం సంభవించింది' అని స్పష్టంగా ఉండాలి.
కావాల్సిన పత్రాలు
- ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన శపపరీక్ష రిపోర్టు కావాలి.
- వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించాలి.
- మరణించిన రోజున ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ (IMD) ధ్రువీకరించాల్సి ఉంటుంది.
- మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ ఇచ్చిన మరణ ధ్రువీకరణ పత్రం.
- మృతుడి, కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డుల జిరాక్సులు (Aadhaar etc.).
- పరిహారం జమ కావడానికి బ్యాంకు పాస్బుక్ వివరాలు.
- వారసుల వివరాల కోసం కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం.
దరఖాస్తు ఎలా చేయాలి?
- మరణం సంభవించిన వెంటనే స్థానిక VRO లేదా తహసీల్దారు కార్యాలయానికి సమాచారం అందించాలి.
- పైన చెప్పిన పత్రాలన్నింటినీ జతచేసి తహసీల్దారు ఆఫీసులో దరఖాస్తు అందజేయాలి.
- రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆ నివేదికను జిల్లా కలెక్టరుకు పంపిస్తారు.
- కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాత, రూ. 4 లక్షల పరిహారం నేరుగా నామినీ బ్యాంకు ఖాతాలో జమవుతుంది.
ఎండలు తీవ్రంగా ఉన్నందున అనవసరంగా బయటకు రావద్దు. ఒకవేళ వడదెబ్బ కారణంగా ప్రమాదం జరిగితే, ఆలస్యం చేయకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుని మీ కుటుంబాన్ని ఆదుకోండి.
ఇక వేసవిలో శరీరంలో నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్తుందనే విషయం తెలిసిందే. దీని కారణంగా ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి తీసుకోవాలి. చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. కానీ దీనివల్ల ప్రయోజనం ఉండదు. కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది. ఐస్క్రీంలు, కూల్డ్రింక్స్కు దూరంగా ఉండాలి. ఫాస్ట్ఫుడ్, బర్గర్లు, ఫ్రైడ్ రైస్లు, మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి.
Anand Sai, Hyderabad

