Dailyhunt
వేసవిలో నీటి కష్టాలకు చెక్.. వాటర్ షెడ్ల పునరుద్ధరణతో ఏజెన్సీ ప్రాంతాల్లో కష్టాలు తీర్చనున్న పవన్ కళ్యాణ్!

వేసవిలో నీటి కష్టాలకు చెక్.. వాటర్ షెడ్ల పునరుద్ధరణతో ఏజెన్సీ ప్రాంతాల్లో కష్టాలు తీర్చనున్న పవన్ కళ్యాణ్!

'జలమే జీవం.. జీవమే జల సంరక్షణకు మూలం అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలి. సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే చర్యలు నుంచి వాగులు, వంకలు, నదుల ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని కాపాడుకునే వరకు ఈ చైతన్యం అందరిలో వెల్లివిరియాలి.' అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

భూమి మీద మనిషికి అవసరం అయ్యే నీటి శాతం చాలా తక్కువగా ఉంది.. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేసినట్లేనని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వంపై ఒక రోజు వర్క్ షాపు కానూరులోని ఏపీఎస్ఐఆర్డీ భవన్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నీరు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి బాగుంటుందన్నారు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన విధానం మెరుగవడానికి గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార వంటి నదులే జీవనాధారమని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా దేశంలో ముందు వరుసలో ఉండటానికి మనకు సమృద్ధిగా ఉన్న నీటి వనరులే కారణమని చెప్పారు. అలాంటి నీటిని సంరక్షించుకునే పెద్ద సవాల్ ఇప్పుడు మన ముందుంది అని చెప్పారు.

'ఉపరితల జలాలను జాగ్రత్తగా కాపాడుకోవడం, రానురాను తగ్గుతున్న భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీనిపై ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. భవిష్యత్తును సుందరంగా నిర్మించుకోవాలంటే ప్రతి నీటి చుక్క ఎంత విలువైందో తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే నీటి సంరక్షణ చర్యలు, వృథా అయ్యే నీటిని కాపాడుకునే చర్యలను వేగవంతం చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు మనం భరోసానిచ్చినట్లు అవుతుంది.' అని పవన్ అన్నారు.

ప్రతి కుటుంబానికీ తగినంత తాగు నీరు అందించాలనే ఆశయానికి క్షేత్రస్థాయిలో ఎన్నో అవరోధాలు ఉన్నాయని పవన్ అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తగినంతగా - ఉపరితలంలో లభించే నీరు లభ్యత లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం కీలకమైన సమస్యలుగా ఉన్నాయని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరి శిఖర గ్రామాల్లో వేసవిలో నీటి సమస్యను తీర్చేందుకు వాటర్ షెడ్ల పునరుద్ధరణకు ప్రణాళికలు వేస్తున్నామన్నారు. మారుతున్న సాంకేతికను ఎప్పటికప్పుడు వినియోగించుకొని నీటి కొరత తీర్చేందుకు, నీటి సంరక్షణ చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నామని, ముఖ్యంగా నీటి సంరక్షణ చర్యల్లో ప్రజల భాగస్వామ్యం అవసరం అని చెప్పారు.

జల్ జీవన్ మిషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు పవన్ కళ్యాణ్. నీటిని జాగ్రత్తగా వినియోగించుకునేలా, వృథా నీటిని పునర్వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన తీసుకురావడం ప్రధానం అన్నారు.

'రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 100 రోజుల నీటి వినియోగ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని ఈ ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు చేపట్టింది. దీనిలో ప్రజల్లో చైతన్యం కలిగించి భూగర్భ జలాల పెంపుదల, నీటి వృథాను అడ్డుకోవడం, నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం వంటి చర్యలను తీసుకుంది. ప్రకృతిలో మన జీవనం.. జీవితం ముడిపడి ఉందనేది భారతీయ సంస్కృతికి మూలం. ప్రకృతిని కాపాడుకుంటే, ప్రకృతి మనకు మంచి చేస్తుంది.' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Anand Sai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu