ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ భార్య అనూష తాజాగా స్పందించారు. తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రశ్న రావణ్గా ప్రజలకు పరిచయమున్న తన భర్తపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు అనూష.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియోలు పూర్తిగా కల్పితమైనవి, క్రియేట్ చేశారని చెప్పారు. తమ తప్పులను సమర్థించుకునేందుకే కొందరు లేని వీడియోలను సృష్టించి ఈ తప్పుడు ప్రచారానికి దిగారని పేర్కొన్నారు.
కొన్ని మీడియా సంస్థలు రావణ్ కులాన్ని వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అనూష అన్నారు. కులాలు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు తమ కుటుంబం పూర్తిగా వ్యతిరేకమని వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి తన భర్త కులం గురించి చెప్పారు. తన భర్త పేరును ఉపయోగించి ఫలానా పార్టీ, ఫలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తమకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధాలు లేవని, గొంతులేని వర్గాలకు ఒక గొంతుకై నిలబడడమే రావణ్ పార్టీ అన్నారు.
'సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్నదే రావణ్ సిద్ధాంతం. ఎవరినీ కించపరచాలని, నొప్పించాలని కాదు. ఒక ప్రజాస్వామ్యవాదిగా ఆయన గట్టిగా ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు చెప్పాలి లేదా లోపాలను సరిదిద్దుకోవాలి. అంతే కానీ ఇలా చట్టవ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయం. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలే రావణ్ మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ను కూడా అరెస్ట్ చేయాలి కదా.' అని అనూష అన్నారు.
ఇటీవల రాష్ట్రంలో జరిగిన కొన్ని దారుణమైన సంఘటనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే రావణ్ను వేధించే కార్యక్రమం పెట్టుకున్నారని అనూష ఆరోపించారు. 'ఒక ప్రభుత్వంతో పోరాడేంత బలం మాకు లేదు, కానీ నిజాయితీ మాకు ఉంది. కాకపోతే రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సంప్రదాయం అమలైతే అది ఈ సమాజానికి మంచిది కాదు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైనా, న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం మాకు ఉంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల మా కుటుంబానికి అపారమైన నమ్మకం ఉంది.' అని ఆమె పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను ఎవరూ విశ్వసించవద్దని, ప్రజాస్వామ్యవాదులంతా రావణ్కు అండగా నిలవాలని అనూష విజ్ఞప్తి చేశారు.
ప్రశ్న రావణ్పై ఉపా కేసు
సామాజిక, రాజకీయ అంశాలపై యూట్యూబ్ వేదికగా మాట్లాడే ప్రశ్న రావణ్పై పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA - Unlawful Activities Prevention Act) కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వీడియోలు చేస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. సాధారణంగా దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు భంగం కలిగించే తీవ్రమైన కేసుల్లో ఉపయోగించే ఉపా(UAPA) చట్టాన్ని ఒక యూట్యూబర్పై ప్రయోగించడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు నమోదును పలువురు ప్రజాస్వామ్యవాదులు, హక్కుల నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య అనూష స్పందిస్తూ.. ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
Anand Sai

