
తిరుపతి, 21 మే (హి.స.)
, : శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుపతి ముస్తాబు అవుతోంది. ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. ఇందులో ఇప్పటికే గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముందు సంప్రదాయబద్ధంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
దీనిలో భాగంగా ఇప్పటికే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీఆండాళ్ అమ్మవారి ఆలయం, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేయడంతో ఆలయ ప్రాంగణం భక్తి పరిమళాలతో నిండిపోయింది. వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV

