Dailyhunt

ఐపీఎస్ విశాల్ గున్నీకి హైకోర్టులో షాక్.. సస్పెన్షన్ కొనసాగింపు

అమరావతి, 06 మే (హి.స.)

సీనియర్ ఐపీఎస్ అధికారి, డీఐజీ విశాల్ గున్నీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ను ఎత్తివేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) జారీ చేసిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది.

ఈ నిర్ణయంతో విశాల్ గున్నీ సస్పెన్షన్లోనే కొనసాగనున్నారు.

విశాల్ గున్నీ సస్పెన్షన్ను రద్దు చేస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తుహిన్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. విశాల్ గున్నీపై ఉన్నవి తీవ్రమైన ఆరోపణలని, ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే ఆయన మరో రాష్ట్రానికి వెళ్లి నటిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో క్యాట్ జోక్యం చేసుకోవడం తొందరపాటు చర్య అవుతుందని వాదించారు. విశాల్ గున్నీ తరపున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు.

ఇరుపక్షాల వాదనల అనంతరం ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ కేసులో సుదీర్ఘ విచారణ అవసరమని అభిప్రాయపడింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 29కి వాయిదా వేసింది.

కాగా, ముంబైకి చెందిన నటి కాదంబరి జెఠ్వానీని వేధించారన్న ఆరోపణలతో 2024లో విశాల్ గున్నీపై కేసు నమోదైంది. అధికార దుర్వినియోగం ఆరోపణలపై ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేయగా, దానిని ఆయన క్యాట్లో సవాల్ చేశారు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు రాగా, తాజాగా హైకోర్టు స్టే విధించడంతో ఆయన సస్పెన్షన్ కొనసాగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu