Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

బలూచిస్థాన్లో రక్తపాతం.. పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి.. 24 మంది మృతి

బలూచిస్థాన్, 24 మే (హి.స.)

పాకిస్థాన్లో ఘోర ఉగ్రదాడి జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్లో సైనిక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో కనీసం 24 మంది మరణించగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో సైనికులు కూడా ఉన్నట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ఆదివారం ఈ దాడి జరిగింది. క్వెట్టా నుంచి పెషావర్కు వెళుతున్న ఈ రైలులో సైనికులు, వారి కుటుంబసభ్యులు ఉన్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బక్రీద్ పండుగ కోసం వీరంతా తమ స్వస్థలాలకు పయనమయ్యారు. రైలు క్వెట్టాలోని చమన్ పట్టక్ వద్ద సిగ్నల్ దాటుతున్న సమయంలో పేలుడు పదార్థాలతో నింపిన కారుతో ఒక బోగీని ఉగ్రవాదులు ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.

ఈ పేలుడు తీవ్రతకు రైలు బోగీ నుజ్జునుజ్జయి పక్కకు ఒరిగిపోయింది. పలు కోచ్లు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. రక్తంతో తడిసిన బాధితులను స్ట్రెచర్లపై తరలిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించాయి.

విస్తీర్ణంలో పాకిస్థాన్లోనే అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ, బలూచిస్థాన్ అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. ఈ ప్రావిన్స్లోని సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం దోచుకుంటోందని, స్థానిక ప్రజలకు ప్రయోజనాలు కల్పించడం లేదని బలూచ్ వేర్పాటువాద గ్రూపులు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu