
న్యూఢిల్లీ, 05 మే (హి.స.)
అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ విజయం (Big win for BJP) సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP), ఎన్నికల కమిషన్ (EC) సహకారంతో ప్రజా తీర్పును అపహాస్యం చేసిందని ఆయన ఆరోపించారు. బెంగాల్లో మమతా బెనర్జీ (Mamata Banerjee) వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని, అక్కడ సుమారు 100 కు పైగా స్థానాలను బీజేపీ అక్రమంగా దక్కించుకుందని రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
తన గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే తరహా 'ప్లేబుక్'ను అనుసరించి ఎన్నికలను దొంగిలించిందని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, బీజేపీ అధికారాన్ని అడ్డదారిలో నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోందని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కేరళ తమిళనాడులో జరిగిన ఎన్నికలు సరైనవి అయినప్పుడు, బీజేపీ గెలిచిన రాష్ట్రాల ఫలితాలపైనే విమర్శలు చేయడంపై రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

