Dailyhunt

బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

తమిళనాడు , 04 ఏప్రిల్ (హి.స.)

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల కోసం 27 మందితో కూడిన తొలి జాబితాను శుక్రవారం ప్రకటించింది.

ఈ జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్కు చోటు దక్కగా, పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని కీలకమైన మైలాపూర్ నియోజకవర్గం నుంచి తమిళి సై పోటీ చేయనున్నారు.

పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బీజేపీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తెలిపారు. ఒకే నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలనే ఉద్దేశంతో అన్నామలై ఉన్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయనని, పార్టీ కార్యకర్తగా అందరి గెలుపు కోసం పనిచేస్తానని అన్నామలై సైతం గతంలోనే ప్రకటించారు.

ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తోంది. తాజా జాబితాలో కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్కు అవనాశి (ఎస్సీ) స్థానాన్ని, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్కు కోయంబత్తూర్ నార్త్ స్థానాన్ని కేటాయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సత్తూరు నుంచి, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎస్. విజయధరణి విలవన్కోడ్ నుంచి బరిలో దిగుతున్నారు.

తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Telugu